
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్కు కర్ణాటకలోని బళ్లారిలో ఘన స్వాగతం లభించింది. రాయదుర్గంలో సుజలాన్ సంస్థ పవన విద్యుత్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బళ్లారి చేరుకున్న ఆయనకు జిందాల్ విజయనగర్ విమానాశ్రయంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం బళ్లారి నుంచి రాయదుర్గం వరకు లోకేష్ రోడ్డు మార్గంలో ప్రయాణించారు. మార్గమధ్యంలో పలుచోట్ల అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆయనకు జేజేలు పలుకుతూ స్వాగతం పలికారు. వారికి అభివాదం చేస్తూ లోకేష్ ముందుకు సాగారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తోందని ఈ సందర్భంగా లోకేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజల సహకారం, మద్దతు అవసరమని తెలిపారు. ఇదే విధమైన ప్రజా మద్దతు కొనసాగితే ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు.
బళ్లారి విమానాశ్రయంలో కర్ణాటక మంత్రులతో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీలు బీకే పార్థసారథి, అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు పల్లె సింధూర రెడ్డి, దగ్గుపాటి వెంకట ప్రసాద్, అమిలినేని సురేంద్రబాబు, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, ఏపీఐఐసీ డైరెక్టర్ చల్లా లక్ష్మీప్రసాద్, టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉమర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే.. రాయదుర్గం ప్రాంతంలో సుజలాన్ సంస్థ భారీ పెట్టుబడులతో పవన విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం కీలక పరిణామంగా నాయకులు పేర్కొన్నారు. సుమారు రూ.10 వేల కోట్ల పెట్టుబడులతో మొత్తం 1,325 మెగావాట్ల సామర్థ్యంతో పవన విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 4,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

