
రాయదుర్గం (D news): కరువు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి పారిశ్రామికీకరణ ఎంతో కీలకమని రాయలసీమ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాయదుర్గం ప్రాంతంలో పవన విద్యుత్ పరిశ్రమ ఏర్పాటు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనతో యువతకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ప్రాంత ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ రాయలసీమలో పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని తెలిపారు. యువగళం రథసారథి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పారిశ్రామిక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ రాయలసీమ ప్రగతికి కృషి చేస్తున్నారని అన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్ క్రాసింగ్ వద్ద భారీ పెట్టుబడులతో పవన విద్యుత్ పరిశ్రమ ఏర్పాటు కానుండటం ఈ ప్రాంత అభివృద్ధికి మరింత ఊతమిస్తుందని పేర్కొన్నారు.
జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో సుదూర ప్రాంతంగా ఉన్న రాయదుర్గం కర్ణాటక సరిహద్దుకు సమీపంలో ఉండటం వల్ల పారిశ్రామిక అభివృద్ధికి అనేక అనుకూల అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం లభిస్తోందన్నారు.
స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు రైతులకు కూడా ప్రయోజనం చేకూరేలా రాయదుర్గం ప్రాంతాన్ని పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు రాయలసీమ భవిష్యత్ ప్రగతికి బాటలు వేస్తాయని పూల నాగరాజు అన్నారు.

