భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక ప్రకటన చేసింది. టీమిండియా స్వదేశీ క్రికెట్ సీజన్‌కు క్యాంపా, ఎస్బీఐ లైఫ్, ChatGPTలను అసోసియేట్ పార్ట్నర్లుగా ప్రకటించింది. ఈ భాగస్వామ్యం రెండు సీజన్ల పాటు కొనసాగనుంది. భారత్-వెస్టిండీస్ సిరీస్‌తో ప్రారంభమయ్యే ఈ ఒప్పందం 2028 మార్చి వరకు అమల్లో ఉండనుంది.

ఈ మూడు ఒప్పందాల ద్వారా బీసీసీఐకి రూ.130 కోట్లకు పైగా ఆదాయం సమకూరనుంది. గత భాగస్వామ్య సైకిల్‌తో పోలిస్తే ఈసారి డీల్ విలువ ఏకంగా 44 శాతం పెరిగినట్లు బీసీసీఐ వెల్లడించింది. దీంతో భారత క్రికెట్‌కు ఉన్న మార్కెట్ డిమాండ్ మరోసారి స్పష్టమైంది.

క్యాంపా పానీయాల రంగానికి, ఎస్బీఐ లైఫ్ బీమా రంగానికి, ChatGPT ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రంగానికి చెందిన సంస్థలు. విభిన్న రంగాలకు చెందిన ఈ మూడు బ్రాండ్లతో భాగస్వామ్యం భారత క్రికెట్‌కు మరింత విస్తృతమైన వాణిజ్య అవకాశాలను తీసుకురానుందని బీసీసీఐ తెలిపింది.

బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ మాట్లాడుతూ.. భారత స్వదేశీ క్రికెట్ సీజన్ దేశంలో అత్యంత విలువైన క్రీడా వేదికల్లో ఒకటిగా కొనసాగుతోందన్నారు. కొత్త భాగస్వామ్యాల విలువ 44 శాతం పెరగడం, టీమిండియాకు ఉన్న భారీ అభిమాన ఆదరణను, బ్రాండ్ల నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు.

బీసీసీఐ గౌరవ కార్యదర్శి దేవజిత్ సైకియా కూడా తాజా ఒప్పందాలపై స్పందించారు. రూ.130 కోట్లకు పైగా విలువైన భాగస్వామ్యాలు కుదరడం భారత క్రికెట్‌పై బ్రాండ్లకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు. విభిన్న రంగాలకు చెందిన సంస్థలు టీమిండియాతో చేతులు కలపడం ఆసక్తికర పరిణామమని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *