
తెలంగాణలోని ప్రధాన జిల్లా కేంద్రాల చుట్టూ రింగ్ రోడ్లు నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ వాహనాల నియంత్రణ, వేగవంతమైన రవాణానే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. దాంతో పాటు కాలుష్య నివారణలో భాగంగా ప్రభుత్వ శాఖలు ఇకపై కేవలం ఎలక్ట్రిక్ వాహనాలనే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. ఆర్టీవో కార్యాలయాలకు సొంత భవనాలు, శంషాబాద్ వద్ద అత్యాధునిక బస్ టెర్మినల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.
తెలంగాణ జిల్లాలకు మహర్దశ పట్టనుంది. ప్రధాన జిల్లా కేంద్రాలన్నింటి చుట్టూ రింగు రోడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కేంద్రాల్లోకి భారీ వాహనాలు వెళ్లకుండా నియంత్రించడంతో పాటు సరకు రవాణా వాహనాలు వేగంగా వెళ్లేందుకు రింగు రోడ్లు ఉపయోగపడతాయని చెప్పారు. రోడ్లు – భవనాల శాఖ పురోగతిపై సీఎం రేవంత్ బుధవారం (మార్చి 11) సంబంధింత మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇతర అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఇప్పటికే ఆయా జిల్లా కేంద్రాలకు సమీపంలో రోడ్లు ఉంటే వాటిని అనుసంధానించి రింగ్ రోడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. జాతీయ రహదారులకు రింగు రోడ్లను అనుసంధానించే అంశంపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ – విజయవాడ ఎక్స్ప్రెస్ వే నుంచి నాగార్జునసాగర్ చేరేందుకు గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణంపైనా అధ్యయనం చేయాలని చెప్పారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఆర్వోబీలు, ఆర్యూబీల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని, అవసరమైన నూతన ఆర్వోబీలు, ఆర్యూబీల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. బోధనాసుపత్రులు, ఇతర పెద్దాసుపత్రుల నిర్మాణలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

