
దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి జనగణన ప్రక్రియ ప్రారంభంకానుంది.. రెండు దశల్లో దీన్ని చేపట్టనున్నారు. తొలిదశలో భాగంగా గృహ గణన.. రెండో దశలో జనాభా లెక్కల సేకరణ ఉంటుంది. మొబైల్ యాప్ ద్వారా అధికారులు ఇంటింటికీ వెళ్లి ఇళ్ల వివరాలు సేకరించనున్నారు. అయితే ఏపీలో ఈ జనగణన బాధ్యతల్ని సచివాలయాల ఉద్యోగులకు అప్పగించాలని నిర్ణయించారు.. మార్గదర్శకాలను జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్లో స్వర్ణ గ్రామ, సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం కీలక బాధ్యతల్ని అప్పగించాలని నిర్ణయించింది. ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా జనగణన ప్రారంభంకానుండగా.. ఏపీలో మే 1 నుంచి తొలి దశ ప్రారంభంకానుంది. అయితే ఏపీలో జనగణనకు సంబంధించి ఎన్యుమరేటర్ల నియామకంపై కొంతకాలంగా సందిగ్ధత కొనసాగింది. ఈ బాధ్యతల్ని ఎవరికి అప్పగించాలనే అంశంపై అయోమయం ఉంది. గతంలో జనగణనకు ఎన్యుమరేటర్లుగా టీచర్లకు బాధ్యతలు అప్పగించారు. అయితే ఈసారి స్వర్ణ గ్రామ, సచివాలయ ఉద్యోగులకు గణన బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు.. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేశారు.
జనగణనకు సంబంధించి ఒక్కో సచివాలయ ఉద్యోగికి ప్రతి 700 నుంచి 800 మంది జనాభాకు ఎన్యుమరేటర్గా నియమించనున్నారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా మండలాలవారీగా సచివాలయ ఉద్యోగుల వివరాలను అందజేయాలని సంబంధిత అధికారుల్ని జనగణన విభాగం కోరింది. మరో వారంలో ఎన్యుమరేటర్లను నియమించి శిక్షణ కూడా వెంటనే ప్రారంభించనున్నారు. మార్చి నెలలో జిల్లా, సబ్ డివిజన్, అడిషనల్ ఛార్జ్, సిట్ ఎన్యుమరేటర్ అధికారులు, మాస్టర్ ట్రైనర్లు, ఫీల్డ్ ట్రైనర్లకు శిక్షణ పూర్తి చేశారు. త్వరలో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లను నియమించి.. వారికి మాస్టర్ ట్రైనర్లు, ఫీల్డ్ ట్రైనర్ల ద్వారా మండలాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణను ఏప్రిల్ 24లోపు శిక్షణ పూర్తి చేయాలని ఆదేశాలు వచ్చాయి. అయితే ఎన్యుమరేటర్లుగా నియమించే సచివాలయ ఉద్యోగులకు గౌరవ వేతనం రూ. 25,000 వరకు లభించే అవకాశం ఉందని తెలుస్తోంది.

