
ఆరు గ్యారంటీలు ఇచ్చి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇదే తరహా వ్యూహాన్ని కేరళంలోనూ అమలు చేస్తోంది. మలయాళీలకు ఐదు గ్యారంటీలను హస్తం పార్టీ ఆఫర్ చేస్తోంది. తెలంగాణ తరహాలోనే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే అక్కడి బడ్జెట్ పరిమితులు, ప్రజల ఆలోచనా విధానాన్ని దృష్టిలో ఉంచుకొని మిగతా హామీల అమలు విషయంలో హస్తం పార్టీ ఆచితూచి వ్యవహరించింది.
ఏప్రిల్ 9న కేరళం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్కు కొద్ది రోజులే గడువు ఉండటంతో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈసారి కేరళంలో బీజేపీ కూడా బలంగా ప్రచారం చేస్తోంది. దీంతో కొన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉంది. అయితే చాలా చోట్ల మాత్రం పోటీ ప్రధానంగా అధికార ఎల్డీఎఫ్, ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్ మధ్యే ఉండే అవకాశం ఉంటుందని అంచనా. గత పదేళ్లుగా కేరళలో అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తుండగా.. ఈసారి ఎలాగైనా మలయాళీల మనసు గెలవాలని హస్తం పార్టీ పట్టుదలతో ఉంది.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని కేరళంలోనూ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణల్లో ఈ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
కాలేజీలకు వెళ్తున్న అమ్మాయిలకు నెలకు రూ.1000 చొప్పున ఆర్థిక సాయం చేస్తామని కేరళంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. తెలంగాణలో ప్రతి మహిళకు నెలకు రూ.2500 చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ హామీ తెలంగాణలో ఇంకా అమలు కాలేదు. దీంతో కేరళంలో ఈ హామీని మార్చారని భావించొచ్చు.

