
ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ మీదుగా మూడు హైస్పీడ్ రైల్వే కారిడార్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బెంగళూరు చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్ తిరుపతి, నాయుడుపేట మీదుగా వెళ్లేందుకు కేంద్రం ఓకే చెప్పింది. ఈ కనెక్టవిటీతో అమరావతికి రెండో హైస్పీడ్ కారిడార్ లింక్ కానుంది. సీఎం చంద్రబాబు రిక్వెస్ట్ మేరకు కేంద్రం ఈ ఎలైన్మెంట్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రెండు హైస్పీడ్ రైల్ కారిడార్లకు కనెక్ట్ కానుంది. వాస్తవానికి ఏపీ మీదుగా మూడు కారిడార్లు వెళుతుండగా.. రెండు కారిడార్లు అమరావతితో లింక్ కాబోతున్నాయి. హైదరాబాద్-చెన్నై కారిడార్ను ఇప్పటికే అమరావతితో కనెక్ట్ చేయాలని కేంద్రం నిర్ణయించగా.. తాజాగా మైసూరు-చెన్నై కారిడార్ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా బెంగళూరు-చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ను చిత్తూరు నుంచి తిరుపతి మీదుగా నాయుడుపేటకు లింకు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు వినతతితో ఈ ప్రతిపాదనకు కేంద్రం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే హైదరాబాద్ టు చెన్నై కారిడార్ అమరావతి మీదుగా గుంటూరు, చీరాల, ఒంగోలు, నెల్లూరు, నాయుడుపేట, శ్రీసిటీ మీదుగా చెన్నైకి ఏర్పాటు కానుంది. తాజా ప్రతిపాదనల ప్రకారం నాయుడుపేట, తిరుపతి, చిత్తూరు, బంగారుపాళ్యం, బెంగళూరు, మాండ్య మీదుగా మైసూరుకు రెండో కారిడార్ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రతో పాటుగా తమిళనాడు, కర్ణాటకలకు ఉపయోగపడేలా హైస్పీడ్ కారిడార్లను కేంద్రం ప్లాన్ చేసింది. వీటిలో హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు, బెంగళూరు-చెన్నై కారిడార్లు ఉన్నాయి. అయితే ఈ కారిడార్లలో తిరుపతిని చేర్చలేదు.

