
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్, యూరియా కొరతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్న వేళ.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఉన్న నిల్వలు, సరఫరాలకు సంబంధించి చర్చించనున్నారు. అనంతరం రాష్ట్రంలో కొరత లేకుండా వినియోగదారులకు పకడ్బందీగా సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేయనున్నారు.
ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్పై.. చేస్తున్న దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ చేస్తున్న ప్రతీకార దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఈ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం నెలకొంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోనూ చమురు, గ్యాస్ కొరత ఉందన్న ఆరోపణలు వస్తున్న వేళ.. తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది. అదే సమయంలో హైదరాబాద్ నగరంలో చాలా పెట్రోల్ బంకులు మూతపడి ఉండటం.. మిగిలిన వాటి ముందు భారీగా క్యూలైన్లు ఉండటంతో వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ అలర్ట్ అయింది. తెలంగాణలో డీజిల్, పెట్రోల్, గ్యాస్ సిలిండర్లు, యూరియా నిల్వలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ కమిటీ హాలులో అత్యవసర ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా భవిష్యత్తులో ఇంధన దిగుమతులకు ఆటంకం కలిగితే.. రాష్ట్రంలో కొరత రాకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే అంశంపై ఈ సమావేశంలో ప్రధానంగా సంబంధిత అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరపనున్నారు.

