
సింహాచలం చందనోత్సవం ఏర్పాట్లపై విశాఖపట్నం జిల్లా ఇంఛార్జ్ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి సమీక్ష చేశారు. కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి చందనోత్సవం ఏర్పాట్లపై చర్చించారు. చందనోత్సవంలో సాధారణ భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచనలు చేశారు. టికెట్ల జారీలో ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వొద్దని.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమీక్షలో ఎమ్మెల్యే కొన్ని కీలక సూచనలు చేశారు.
సింహాచలం లక్ష్మీనృసింహ స్వామి చందనోత్సవం ఏప్రిల్ 20న జరగనుంది.. ఆలయంలో ఏర్పాట్లపై ముందుగానే ప్రభుత్వం దృష్టిపెట్టింది. విశాఖపట్నం జిల్లా ఇంఛార్జ్ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి చందనోత్సవం ఏర్పాట్లపై ఎమ్మెల్యేలు, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి సమీక్ష చేశారు. గత అనుభవాల దృష్ట్యా ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు మంత్రి స్వామి. చందనోత్సవంలో సాధారణ భక్తులకు పెద్దపీట వేయాలన్నారు. అన్నిశాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనులు చేయాలని ఆదేశించారు. ఏప్రిల్ 17నాటికి చందనోత్సవం టికెట్ల జారీ ప్రక్రియను పూర్తి చేయాలని.. వాహన పాసులు, డ్యూటీ పాసుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
చందనోత్సవానికి సంబంధించి దర్శనాల టికెట్ల విషయంలో ఎలాంటి గందరగోళం లేకుండా చూడాలని ఎమ్మెల్యేలు కోరారు. గతేడాది చందనోత్సవానికి సంబంధించి రాత్రి 11 గంటల వరకు భక్తులకు టికెట్లు ఇవ్వలేదన్నారు. ఈసారి మూడు రోజులు ముందుగా జారీ చేయాలని.. టికెట్ల లెక్క పక్కాగా ఉండాలన్నారు. కలెక్టర్, ఈవోల చేతుల మీదుగా టికెట్లు జారీ చేస్తే బావుంటుందని సూచించారు. అలాగే టికెట్లపై క్యూఆర్ కోడ్, స్లాట్ వివరాలు ఉండేలా చూడాలని కోరారు.
చందనోత్సవం రోజు దర్శనాల కోసం వేర్వేరుగా క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు కలెక్టర్ హరేంధిరప్రసాద్. రూ.300, రూ.1000, రూ.1500 దర్శన టికెట్లు ఉన్న భక్తులకు విడివిడిగా క్యూ లైన్లు ఉంటాయన్నారు. వీరిలో రూ.1500 టికెట్ ఉన్న భక్తులు మాత్రం భోగమండపం నుంచి స్వామిని దర్శించుకోవచ్చన్నారు. చందనోత్సవం రోజు అప్పన్నకు ముందుగా సుప్రభాత సేవ నిర్వహిస్తారని.. అనంతరం వ్యవస్థాపక ధర్మకర్తలకు తొలి దర్శనం ఉంటుందన్నారు.

