
ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ‘సఖి నివాస్’ పేరుతో కొత్తగా వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లను ఏర్పాటు చేయబోతోంది. ఇటీవల కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోగా.. తాజాగా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 30 హాస్టల్స్ ఏర్పాటు చేయనున్నారు. తక్కువ ఖర్చుతో వసతి, భోజన సౌకర్యాలు కల్పించేలా వీటిని ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ ఉమెన్స్కు వసతి కల్పించేందుకు సఖి నివాస్ పేరుతో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ఏర్పాటు చేయనుంది. మొత్తం 30 సఖి నివాస్ (వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు) ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో సఖి నివాస్లో 30మందికి వసతి కల్పించనున్నారు.. అవసరమైన సిబ్బందిని కూడా నియమించనున్నారు. సఖి నివాస్లో డార్మెటరీతో పాటు సింగిల్, డబుల్ గదులు ఏసీ నాన్ ఏసీ గదులు ప్లాన్ చేస్తున్నారు. రిక్రియేషన్ హాలు, ఒకవేళ ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే సిక్ రూమ్ కూడా అందుబాటులో ఉంటాయి.
ఒక్కో హాస్టల్కు మేనేజర్, వార్డెన్, కేర్ టేకర్లు, సెక్యూరిటీ గార్డు, నైట్ గార్డు పోస్టులు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఒక్కో సఖి నివాస్కు మొత్తం 8 పోస్టులు ఉంటాయి. ఈ మేరకు నెలకు రూ.84000, ఏడాదికి రూ.10.08 లక్షల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ హాస్టల్స్లో మహిళా ఉద్యోగుల పిల్లల కోసం క్రెచ్ కూడా అందుబాటులో ఉంచనున్నారు. ఈ సఖి నివాస్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారికి తక్కువ ధరకే వసతి, భోజన సదుపాయాలు అందుబాటులోకి రానుంది. అలాగే చదువుకునే యువతులకు కూడా ఈ సఖి నివాస్లో సదుపాయం కల్పిస్తారు. రాష్ట్రంలో సఖి నివాస్లు ఏర్పాటు చేయాలని ఇటీవల కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తాజాగా హాస్టల్స్ ఏర్పాటుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు.

