
CSK Playing XI: ఐపీఎల్ 2026 సమరానికి కౌంట్డౌన్ మొదలైన వేళ, మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఎంపిక చేసిన చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు ఇప్పుడు పెను సంచలనంగా మారింది. వేలంలో భారీ ధర పలికిన స్టార్ ఆటగాడిని పక్కన పెట్టి, శ్రీకాంత్ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం సోషల్ మీడియాలో క్రికెట్ ప్రేమికుల మధ్య పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అంటేనే వ్యూహాలకు మారుపేరు. అయితే, భారత మాజీ ఓపెనర్ శ్రీకాంత్ తాను కోరుకున్న అత్యుత్తమ పదకొండు మంది ఆటగాళ్ల జాబితాలో ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్ 2026 వేలంలో ఏకంగా రూ. 14.20 కోట్ల భారీ ధరకు అమ్ముడైన కార్తీక్ శర్మకు ఆయన తన జట్టులో చోటు కల్పించలేదు. ఇంత భారీ పెట్టుబడి పెట్టిన ఆటగాడిని రిజర్వ్ బెంచ్కే పరిమితం చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
శ్రీకాంత్ తన జట్టులో ఓపెనర్లుగా టీ20 ప్రపంచకప్ విజేత సంజూ శాంసన్ను, అండర్-19 ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్ ఆయుష్ మమ్హాత్రేను ఎంచుకున్నారు. మూడో స్థానంలో ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ను ఉంచారు. అయితే నాలుగో స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ వంటి అనుభవజ్ఞులను కాదని, విధ్వంసకర బ్యాటర్ ఊర్విల్ పటేల్కు అవకాశం ఇవ్వడం గమనార్హం. ఈ ఎంపిక జట్టులో వేగాన్ని పెంచుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇక మిడిలార్డర్ గురించి మాట్లాడితే డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, వెటరన్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీలతో బలోపేతం చేశారు. ఆసక్తికరంగా, రూ. 14.20 కోట్లు పలికిన మరో 20 ఏళ్ల యువ ఆల్ రౌండర్ ప్రశాంత్ వీర్కు శ్రీకాంత్ తన జట్టులో చోటు ఇచ్చారు. బౌలింగ్ విభాగంలో మ్యాట్ హెన్రీ, ఖలీల్ అహ్మద్ వేగపు బాధ్యతలు చేపట్టగా, గత సీజన్లో 24 వికెట్లతో మెరిసిన అఫ్గాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ ప్రధాన స్పిన్నర్గా ఎంపికయ్యాడు.
శ్రీకాంత్ తన వ్యూహంలో కేవలం ముగ్గురు విదేశీ ఆటగాళ్లను మాత్రమే ప్రధాన జట్టులో ఉంచుకున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్గా మణికట్టు స్పిన్నర్ రాహుల్ చాహర్ను ఎంచుకోవడం ద్వారా స్పిన్ విభాగాన్ని మరింత పటిష్టం చేశారు. ఈ ఎంపికల ప్రకారం అకీల్ హొస్సేన్, మ్యాట్ షార్ట్ వంటి విదేశీ స్టార్లు బెంచ్కే పరిమితం కానున్నారు. ఈ కొత్త జట్టుతో చెన్నై మరోసారి టైటిల్ సాధిస్తుందో లేదో వేచి చూడాలి.

