
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ పథకం నిలిపివేయడంపై వైసీపీ ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేయగా.. రాయలసీమ అంశంపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
ఏపీ శాసనమండలిలో (AP Legislative Council) రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తీవ్ర చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరగడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేయడంపై వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు.. ‘మీరు వేసిన ప్రశ్న ఏమిటి? మీరు మాట్లాడుతున్నది ఏమిటి?’ అని మండిపడ్డారు. రాయలసీమ అంశంపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీ వాళ్లకు ఎక్కడుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు’ అని మంత్రి తీవ్రంగా విమర్శించారు.

