
అమరావతిని క్వాంటం టెక్నాలజీకి నాలెడ్జ్ హబ్గా అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. హైదరాబాద్కు ఐటీ రంగం ఎలాంటి గుర్తింపు తెచ్చిందో, అదే విధంగా అమరావతికి క్వాంటం వ్యాలీని ప్రత్యేక గుర్తింపుగా నిలపాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు.
అమరావతిలో పర్యటించిన మంత్రి నారాయణ క్వాంటం వ్యాలీ నిర్మాణ పనులను పరిశీలించారు. ఐబీఎం, టీసీఎస్ సంస్థల భాగస్వామ్యంతో క్వాంటం ల్యాబ్ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మొత్తం 45,216 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాన్ని నిర్మిస్తున్నామని, ప్రధాన నిర్మాణ పనుల్లో ఎక్కువ భాగం ఇప్పటికే పూర్తయిందని చెప్పారు.
క్వాంటం ల్యాబ్లో అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నట్లు మంత్రి వివరించారు. బయట నుంచి శబ్దం రాకుండా ప్రత్యేక శబ్ద నియంత్రణ వ్యవస్థతో పాటు ‘రూమ్ వితిన్ రూమ్’ డిజైన్ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. క్వాంటం చిప్లను సుమారు మైనస్ 273 డిగ్రీల సెల్సియస్ వద్ద చల్లబరచేందుకు హీలియం కంప్రెసర్లు, క్రయోజెనిక్ డైల్యూషన్ రిఫ్రిజరేటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ల్యాబ్కు నిరంతర విద్యుత్ సరఫరా కోసం డ్యూయల్ యాక్టివ్ ఫీడర్ సిస్టమ్ను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. విద్యుత్ గ్రిడ్ నుంచి వచ్చే హార్మోనిక్స్, విద్యుత్ శబ్దాలను నియంత్రించేందుకు ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్లను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు.
క్వాంటం వ్యాలీ భవన నిర్మాణాన్ని డిసెంబర్ నెలాఖరుకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. ఐబీఎం సంస్థ ఎంఈపీ పనులు చేపట్టేందుకు భవనాన్ని సెప్టెంబర్ 15న అప్పగించనున్నట్లు తెలిపారు.
క్వాంటం ల్యాబ్కు సమీపంలో 50 ఎకరాల విస్తీర్ణంలో రెండు భారీ టవర్లను కూడా నిర్మిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఒక్కో టవర్ 48 అంతస్తులతో, సుమారు 202 మీటర్ల ఎత్తులో ఉండనున్నట్లు తెలిపారు. క్వాంటం టెక్నాలజీ అభివృద్ధికి అవసరమైన పరిశోధన, ఆవిష్కరణలు, పరిశ్రమల భాగస్వామ్యాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా అమరావతిని దేశంలోని కీలక క్వాంటం టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.

