
కాకినాడలోని గుర్రాల బీచ్లో సముద్ర స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఆదివారం నలుగురు స్నేహితులు కలిసి బీచ్కు వెళ్లి సముద్రంలోకి దిగగా.. అలల ఉధృతికి యువ కిశోర్, వీరబాబు గల్లంతయ్యారు. మరో ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంతైన యువకుల కోసం అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా ఎస్పీతో మాట్లాడిన ఆయన.. గాలింపు చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గజ ఈతగాళ్లు, ప్రత్యేక రెస్క్యూ బృందాలు, మెరైన్ పోలీసులు, కోస్టుగార్డ్ సిబ్బందితో పాటు స్థానిక మత్స్యకారుల సహకారం తీసుకోవాలని సూచించారు.
గల్లంతైన యువకుల కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ, వారికి అందుబాటులో ఉండాలని స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఆయన ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా కూడా స్పందించారు.
వివరాల్లోకి వెళ్తే.. వీరబాబు, శ్రీగణేశ్ సాయిరాం, యువ కిశోర్, ఆదిత్య వెంకట సందీప్కుమార్ కలిసి గుర్రాల బీచ్కు వెళ్లారు. జనసంచారం తక్కువగా ఉన్న ప్రాంతంలో నలుగురూ సముద్రంలో స్నానానికి దిగారు. అయితే అలల ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో యువ కిశోర్, వీరబాబు సముద్రంలో గల్లంతయ్యారు. మిగిలిన ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు.
ఇదిలా ఉంటే, అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారడంతో తీర ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. సముద్రంలో వేటకు వెళ్లడం, స్నానాలు చేయడం వంటి వాటికి దూరంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. అయినప్పటికీ ఆదివారం సరదాగా బీచ్లకు వచ్చిన కొందరు పర్యాటకులు ప్రమాదానికి గురయ్యారు.
బాపట్ల జిల్లా చీరాల తీరంలోనూ అలల ఉధృతి కారణంగా సముద్ర కోత ఏర్పడింది. తీరానికి సమీపంలో సుమారు పది అడుగుల మేర భూభాగం కోతకు గురైనట్లు అధికారులు గుర్తించారు. దీంతో పర్యాటకులను బీచ్లోకి అనుమతించలేదు. మెరైన్ పోలీసులు, రెవెన్యూ సిబ్బంది బీచ్ల వద్ద భద్రతా చర్యలు చేపట్టి పర్యాటకులను వెనక్కి పంపించారు. కాకినాడలోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి.

