పెరుగు తరహా ‘స్మార్ట్’ ప్రోబయోటిక్తో డయాబెటిస్ నియంత్రణకు కొత్త ఆశలు
రోజూ ఇంజెక్షన్లు, మాత్రలు తీసుకోవాల్సిన ఇబ్బందుల నుంచి డయాబెటిస్ రోగులకు భవిష్యత్తులో ఉపశమనం లభించే అవకాశం కనిపిస్తోంది. చైనా పరిశోధకులు పెరుగు తరహాలో ఉండే ప్రత్యేకమైన ‘స్మార్ట్’ ప్రోబయోటిక్ను అభివృద్ధి చేసినట్లు సమాచారం. కేవలం ఒక కప్పు రూపంలో తీసుకునే ఈ ప్రోబయోటిక్ రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు సహాయపడేలా రూపొందించినట్లు పరిశోధకులు చెబుతున్నారు. అయితే, ఇది ప్రస్తుతం పరిశోధన దశలోనే ఉందని, డయాబెటిస్ మందులకు ప్రత్యామ్నాయంగా భావించకూడదని గుర్తుంచుకోవాలి.

ప్రపంచవ్యాప్తంగా సుమారు 53 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. 2050 నాటికి ఈ సంఖ్య 85 కోట్లను దాటే అవకాశం ఉందన్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచేందుకు మధుమేహ రోగులు ప్రతిరోజూ మాత్రలు వేసుకోవడం, అవసరాన్ని బట్టి ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవడం వంటి చికిత్సలను కొనసాగించాల్సి వస్తోంది. ఈ రోజువారీ చికిత్సా భారాన్ని తగ్గించే మార్గాల కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మధుమేహ నియంత్రణకు ఉపయోగపడే వినూత్న ప్రోబయోటిక్పై చైనా శాస్త్రవేత్తలు కీలక పరిశోధన చేపట్టారు.
‘గిఫ్ట్’ స్మార్ట్ ప్రోబయోటిక్
ఈస్ట్ చైనా నార్మల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ‘గిఫ్ట్’ పేరుతో జన్యుపరంగా మార్పు చేసిన ఓ ‘స్మార్ట్’ ప్రోబయోటిక్ను అభివృద్ధి చేశారు. ఇది శరీరంలో ఓ గూఢచారిలా పనిచేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణంగా ఉన్నప్పుడు ఈ బ్యాక్టీరియా నిష్క్రియంగా ఉంటుంది. అయితే గ్లూకోజ్ స్థాయిలు ప్రమాదకరంగా పెరిగినప్పుడు వెంటనే స్పందించి క్రియాశీలమవుతుంది. ఇలా రక్తంలో చక్కెర పెరుగుదలను గుర్తించి, అవసరమైన సమయంలో పనిచేసేలా ఈ ‘స్మార్ట్’ ప్రోబయోటిక్ను రూపొందించారు.,
ఈ స్మార్ట్ ప్రోబయోటిక్ శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో కీలకమైన GLP-1 (గ్లూకాగాన్-లైక్ పెప్టైడ్-1) హార్మోన్ విడుదలను ప్రేరేపిస్తుంది. ప్రస్తుతం మధుమేహం, బరువు నియంత్రణలో విస్తృతంగా చర్చనీయాంశమైన ‘ఓజెంపిక్’ తరహా మందులు పనిచేసే విధానంతో ఇది కొంతవరకు పోలి ఉంటుంది. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు ప్రముఖ ‘నేచర్’ సైన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఎలుకలు, కోతులపై నిర్వహించిన ప్రయోగాల్లో ఈ జన్యుపరంగా మార్పు చేసిన ప్రోబయోటిక్ ఆశాజనక ఫలితాలను చూపించింది.
గతాన్ని మార్చిన ప్రయాణం.. సరికొత్త ఆవిష్కరణకు నాంది
2011లో స్విట్జర్లాండ్ నుంచి చైనాకు తిరిగి వచ్చిన శాస్త్రవేత్త యే హైఫెంగ్ తన జీవిత లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకున్నారు. మధుమేహంతో బాధపడుతున్న రోగులు రోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవాల్సిన ఇబ్బందిని తొలగించాలనే సంకల్పంతో పరిశోధనలను ప్రారంభించారు. ఇన్సులిన్ అవసరాన్ని మరింత సులభమైన విధానంలో అందించే మార్గాన్ని కనుగొనడమే ఆయన ప్రధాన లక్ష్యంగా మారింది.
గతంలో ఆయన రూపొందించిన జన్యుమార్పిడి క్షీరద కణాలను ఎలుకల్లో ప్రవేశపెట్టి, వాటిపై నీలి కాంతిని ప్రసరింపజేయడం ద్వారా GLP-1 హార్మోన్ను విడుదల చేయించగలిగారు. ఈ వినూత్న ప్రయోగం అప్పట్లో ‘సైన్స్’ జర్నల్లో ప్రచురితమై శాస్త్రవర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది.
అయితే ఆ విధానంలో ఓ పరిమితి ఉండేది. హార్మోన్ విడుదల ప్రక్రియను ప్రారంభించేందుకు బయట నుంచి నీలి కాంతి వంటి ప్రత్యేక సిగ్నల్ అవసరమయ్యేది. తాజాగా అభివృద్ధి చేసిన ‘గిఫ్ట్’ స్మార్ట్ ప్రోబయోటిక్లో మాత్రం అలాంటి బాహ్య ప్రేరణ అవసరం లేదు. శరీరంలోని మార్పులను స్వయంగా గుర్తించి, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా స్పందించేలా దీనిని రూపొందించారు.
రెండేళ్లలో అమెరికా మార్కెట్లోకి విప్లవాత్మక మందు!
ఈ స్మార్ట్ ప్రోబయోటిక్కు సంబంధించి చైనా పరిశోధకులు ఇప్పటికే పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అమెరికా, యూరప్ దేశాల ఔషధ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తిని భారీ స్థాయిలో చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
“రాబోయే రెండేళ్లలో ఈ ప్రోబయోటిక్ అమెరికా మార్కెట్లో హెల్త్ సప్లిమెంట్ రూపంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది” అని లీడ్ సైంటిస్ట్ యే హైఫెంగ్ ‘చైనా సైన్స్ డైలీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ ప్రాజెక్ట్ తుది దశల్లోనూ విజయవంతమైతే, ప్రపంచవ్యాప్తంగా మధుమేహంతో బాధపడుతున్న కోట్లాది మందికి ఇది కొత్త ఆశాకిరణంగా మారే అవకాశం ఉంది.

