
అమరావతి, ఆగస్టు 25: విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్లో 12 రకాల జంతువులు, పక్షులకు చెందిన 128 కొత్త జీవాలు జన్మించడం పట్ల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఆయన స్పందిస్తూ.. ప్రతి కొత్త జీవం కొత్త ఆశలను నింపుతుందని, ఒక జాతిని సంరక్షించడం అంటే ప్రకృతి సంపదను కాపాడుకోవడమేనని పేర్కొన్నారు.
విశాఖ జూలో చేపట్టిన శాస్త్రీయ సంరక్షణ, పునరుత్పత్తి కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని పవన్ కల్యాణ్ తెలిపారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ చర్యలు రాష్ట్రంలో వన్యప్రాణుల సంరక్షణకు మరింత బలం చేకూరుస్తున్నాయని అన్నారు.
కృత్రిమ ఇంక్యుబేషన్ విధానం ద్వారా 10 ఎర్ర అడవి కోడి పిల్లలు, ఒక బ్లూ-గోల్డ్ మకావ్ పిల్లను విజయవంతంగా పొదిగించడం ప్రత్యేకంగా అభినందించాల్సిన అంశమని పేర్కొన్నారు. ఈ పునరుత్పత్తి కార్యక్రమంలో భాగస్వాములైన అటవీ శాఖ అధికారులు, జూలాజికల్ పార్క్ సిబ్బంది, వెటర్నరీ బృందాన్ని పవన్ కల్యాణ్ అభినందించారు.
శాస్త్రసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తూ జీవవైవిధ్యాన్ని భావితరాలకు అందించే దిశగా ఆంధ్రప్రదేశ్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. వన్యప్రాణుల సంరక్షణకు ప్రజల సహకారం కూడా అవసరమని పేర్కొన్నారు.

