
హైదరాబాద్ శివారులోని కోహెడలో 178 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి పండ్ల మార్కెట్ నిర్మాణానికి సీఎం రేవంత్ తాజాగా రెడ్డి ఆమోదం తెలిపారు. సుమారు రూ.1,901 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ మార్కెట్ కోసం కొత్త డీపీఆర్ రూపకల్పనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ప్రాజెక్టు కార్యాచరణను వేగవంతం చేస్తూ.. అధునాతన వసతులతో మార్కెట్ను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.
హైదరాబాద్ శివారులో అతిపెద్ద పండ్ల మార్కెట్ అందుబాటులోకి రానుంది. కోహెడ సమీపంలో 178 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి అధునాతన వసతులతో ఈ మార్కెట్ నిర్మించనున్నారు. మార్కెట్ నిర్మాణానికి తాజాగా సీఎం రేవంత్రెడ్డి ఆమోదం తెలిపారు. కొత్తగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను తయారు చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కసరత్తు ప్రారంభించారు.
నిజానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోహెడలో 199 ఎకరాల్లో మార్కెట్ నిర్మించాలని భావించింది. అయితే భూసేకరణ ఇతర సమస్యల దృష్ట్యా దాని స్థానంలో కొత్తగా 196 ఎకరాలను కేటాయించేందుకు ఇటీవల సీఎం రేవంత్ నేతృత్వంలోని కేబినెట్ నిర్ణయించింది. ఆ ప్రాంతంలో ఇప్పటికే మార్కెటింగ్ శాఖ అధికారులు సమగ్ర సర్వే నిర్వహించారు. సమీపంలోని కోహెడ గుట్టపై దేవాలయం ఉన్నందున ఆ గుట్టకు రహదారులు ఇతర అవసరాల కోసం 18 ఎకరాలను మినహాయించారు. మిగిలిన 178 ఎకరాల భూమి మార్కెట్ నిర్మాణానికి అనుకూలంగా ఉంటుందని అధికారులు నివేదించారు.
ఈ నివేదికను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన తాజాగా ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా మంత్రి తుమ్మల తాజాగా మార్కెటింగ్ శాఖ, డీపీఆర్ల తయారీ సంస్థ కోసాంబ్ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి మార్కెట్ నిర్మాణంపై దిశానిర్దేశం చేశారు. పండ్ల మార్కెట్ నిర్మాణానికి రూ.1,901 కోట్లు కేటాయించేందుకు గతంలో ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. అవే నిధులను కొత్తగా ప్రతిపాదించిన మార్కెట్కు కేటాయించాలని ముఖ్యమంత్రిని మంత్రి తుమ్మల కోరగా… ఆర్థిక శాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ హామీ ఇచ్చినట్లు తెలిసింది.

