
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరు జిల్లా మంగళగిరి బస్టాండ్లో ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కూడా పాల్గొన్నారు. ముగ్గురు నేతలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఏపీ ప్రభుత్వం ఈ పథకం కింద ప్రతి ఏటా రూ.207 కోట్లు ఖర్చు చేయనుంది.
ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే దివ్యాంగ శక్తి పథకం ప్రారంభమైంది. గుంటూరు జిల్లా మంగళగిరి బస్టాండ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కలిసి ప్రారంభించారు. అనంతరం ముగ్గురు నేతలు దివ్యాంగులతో కలిసి పల్లె వెలుగు బస్సులో ప్రయాణించారు. మంగళగిరి డాన్బాస్కో స్కూల్ మీదుగా డోలాస్ నగర్, ప్రకాశ్నగర్, నులకపేట, ఉండవల్లి సెంటర్ మీదుగా పెనుమాక వరకు ప్రయాణం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి దివ్యాంగుల్ని అడిగి తెలుసుకున్నారు.
దివ్యాంగ శక్తి పథకం పేరుతో ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం అందిస్తోంది ప్రభుత్వం. అందరికీ సమాన అవకాశాలు అందించేలా దివ్యాంగుల ప్రయాణాన్ని సులభతరం చేస్తూ వారిలో ఆత్మవిశ్వాసం నింపేలా పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ దివ్యాంగ శక్తి పథకం ద్వారా దివ్యాంగులు ఐదు రకాల ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించొచ్చు. వీటిలో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులు ఉన్నాయి. మొత్తం 21 కేటగిరీల్లో 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయొచ్చు. దివ్యాంగులతో పాటుగా వారి వెంట వచ్చే సహాయకులతో కలిపి 12.76 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ఈ దివ్యాంగ శక్తి పథకం కోసం ఏపీ ప్రభుత్వం ఏటా రూ.207 కోట్లు ఖర్చు చేయనుంది.

