
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం నుంచి కోలుకోకపోవడంతో అతడి ప్లేసులో ఇషాన్ కిషన్కు కెప్టెన్గా నియమించింది. అతడికి డిప్యూటీగా అభిషేక్ శర్మను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని బుధవారం అధికారికంగా ప్రకటించింది. మార్చి 28న ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది.
రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో సన్ రైజర్స్ హైదరాబాద్.. తాత్కాలిక కెప్టెన్ను ప్రకటించింది. ఈ మేరకు ప్యాట్ కమిన్స్ వచ్చే వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సారథిగా ఇషాన్ కిషన్ వ్యవహరిస్తాడని పేర్కొంది. దీనిపై బుధవారం అధికారిక ప్రకటన చేసింది. ఇదే సమయంలో జట్టుకు వైస్ కెప్టెన్ను సైతం ఎంపిక చేసింది. ఇషాన్ కిషన్కు డిప్యూటీగా అభిషేక్ శర్మను ఎంపిక చేసింది.
ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా కొన్ని నెలలుగా క్రికెట్కు దూరమయ్యాడు. యాషెస్లో కేవలం ఒకే టెస్టు ఆడాడు. ఆ తర్వాత భారత్తో పరిమిత ఓవర్ల సిరీస్, టీ20 ప్రపంచకప్కు దూరమయ్యాడు. ప్రస్తుతం రీహాబ్లో ఉన్న అతడు.. మ్యాచ్ ఫిట్నెస్ సాధించేందుకు మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ కొత్త కెప్టెన్ను ప్రకటించింది. దేశవాళీల్లో జార్ఖండ్ జట్టుకు సారథిగా వ్యవహరించిన ఇషాన్ కిషన్ వైపు.. సన్ రైజర్స్ మొగ్గుచూపించింది. అతడి సారథ్యంలోనే జార్ఖండ్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేతగా నిలిచింది.

