
ఏపీ ప్రభుత్వం పేదలకు తీపికబురు చెప్పింది.. ఒకేసారి ఏకంగా 2.50 లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలకు సిద్ధమైంది. ఈ నెల 30న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా 2.50 లక్షల ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తిరుపతి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే గతంలో టిడ్కో ఇళ్లకు డబ్బులు కట్టి ఆగిపోయినవారికి.. ఆ డబ్బుల్ని తిరిగి చెల్లించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదవాళ్ల సొంత ఇంటి కలను నిజం చేయబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా మరోసారి గృహ ప్రవేశాలకు సిద్ధమైంది. తొలి విడతగా 3 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందజేయగా.. తాజాగా మరో 2.50 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించనున్నారు. వాస్తవానికి ఉగాదికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావించినా కుదరలేదు. ఈ మేరకు ఈ నెల 30న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ 2.50 లక్షల గృహప్రవేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ 2.50 లక్షల గృహాల్లో.. 1.42 లక్షలు కాలనీల్లో చేపట్టిన గృహాలు కాగా.. మిగిలిన 1.08 లక్షలు టిడ్కో ఇళ్లు ఉన్నాయి. తిరుపతి జిల్లా నాయుడుపేటలో నిర్వహించే కార్యక్రమంలో ఈ గృహ ప్రవేశాల కార్యక్రమం నిర్వహించనున్నారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు, లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడనున్నారు.
2017-19 అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో కొంతమంది టిడ్కో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు.. లబ్ధిదారు వాటా డబ్బులు కూడా చెల్లించారు. గత ప్రభుత్వ హయాంలో వారందరికి టిడ్కో ఇళ్లు మంజూరు చేయలేదు. కొంతమందిని జాబితా నుంచి తొలగించి, ఇళ్లు కూడా రద్దు చేసిన పరిస్థితి. అయితే లబ్ధిదారు వాటా కింద చెల్లించిన రూ.172 కోట్లు కూడా తిరిగి చెల్లించలేదు. ఇలా మొత్తం 83వేలమంది ఇబ్బందిపడ్డారు. ఈ సమస్యను గమనించిన కూటమి ప్రభుత్వం.. లబ్ధిదారుల వాటా కింద చెల్లించిన డబ్బుల్ని బాధితుల బ్యాంకు అకౌంట్లలో జమ చేయాలని ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ డబ్బుల్ని కూడా గృహప్రవేశాల కార్యక్రమం రోజున.. అదే వేదికపై ముఖ్యమంత్రి చేతుల మీదుగా బ్యాంక్ అకౌంట్లలో ఈ జమ చేస్తారు.

