దూదిలా మెత్తగా, స్పాంజీగా ఉండే ఇడ్లీలను ఇంట్లోనే తయారు చేయడం అంత కష్టమైన విషయం కాదు. అయితే ఇందుకోసం మినపప్పు, ఇడ్లీ రవ్వను సరైన నిష్పత్తిలో తీసుకోవడంతో పాటు, వాటిని సరైన విధంగా నానబెట్టడం, పిండిని మెత్తగా రుబ్బడం, పులియబెట్టడం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా పిండి రుబ్బే సమయంలో పాటించే కొన్ని చిన్న చిట్కాలు ఇడ్లీలు మరింత మెత్తగా, పొంగినట్టుగా రావడానికి సహాయపడతాయి. పిండిని ఎలా పులియబెట్టాలి? ఇడ్లీలు హోటల్ స్టైల్లో దూదిలా మెత్తగా రావాలంటే ఏం చేయాలి? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే ప్రతిసారీ రుచికరమైన, స్పాంజీ ఇడ్లీలను ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

హోటల్ తరహా మెత్తటి ఇడ్లీల కోసం ఈ చిట్కాలు పాటించండి
దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన అల్పాహారాల్లో ఇడ్లీకి ప్రత్యేక స్థానం ఉంది. సులభంగా జీర్ణమయ్యే ఆహారం కావడంతో చిన్నారుల నుంచి పెద్దల వరకు చాలామంది ఇడ్లీలను ఇష్టంగా తింటారు. అయితే ఇంట్లో తయారు చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో ఇడ్లీలు గట్టిగా రావడం, సరిగ్గా ఉడకకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. హోటల్లో లభించే దూదిలా మెత్తగా, స్పాంజీగా ఉండే ఇడ్లీలను ఇంట్లోనే తయారు చేసుకోవాలంటే కొన్ని ముఖ్యమైన చిట్కాలు పాటించాలి.
పప్పు, రవ్వ నిష్పత్తి ముఖ్యం
మెత్తటి ఇడ్లీల తయారీలో పప్పు, రవ్వల సరైన నిష్పత్తి కీలకం. సాధారణంగా ఒక కప్పు పొట్టు తీసిన మినపప్పుకు 2 నుంచి 2.5 కప్పుల ఇడ్లీ రవ్వ తీసుకోవచ్చు. మినపప్పు నాణ్యతను బట్టి ఈ నిష్పత్తిలో స్వల్ప మార్పులు చేసుకోవచ్చు. మినపప్పును కనీసం 4–5 గంటలు, ఇడ్లీ రవ్వను 2–3 గంటలు విడివిడిగా నానబెట్టుకోవాలి.
అటుకులు లేదా మెంతులు కలపండి
మినపప్పును నానబెట్టేటప్పుడు ఒక టీస్పూన్ మెంతులు కలిపితే పిండి బాగా పులిసేందుకు సహాయపడుతుంది. అలాగే పప్పును రుబ్బే సమయంలో అర కప్పు నానబెట్టిన అటుకులు లేదా కొద్దిగా అన్నం జోడిస్తే పిండి మరింత మెత్తగా మారుతుంది. దీంతో ఇడ్లీలు ఉడికిన తర్వాత దూదిలా మెత్తగా, స్పాంజీగా వచ్చే అవకాశం ఉంటుంది.

