
వైసీపీ నాశనం చేయాలనుకున్న అమరావతిని తాము శాసనం చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం నేపథ్యంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబు.. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, బిల్లుకు మద్దతిచ్చిన పార్టీలకు ధన్యవాదాలు తెలియజేశారు. మరోవైపు శంషాబాద్ ఎయిర్పోర్టు కోసం గతంలో భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు కోటీశ్వరులు అయ్యారని.. వారిలాగే అమరావతి రైతులు కూడా లాభపడతారని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం రైతులు వేల ఎకరాల భూములు ల్యాండ్ పూలింగ్ విధానంలో ఇవ్వటం ఒక కేస్ స్టడీగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. గతంలో హైదరాబాద్లో కంటే అమరావతిలో భూముల విలువ ఎక్కువ ఉండేదని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి చెందిన తర్వాత అక్కడ భూముల విలువ పెరిగిందని.. కానీ అమరావతిలో భూములు వ్యవసాయ భూములు కావటంతో ఎక్కువ విలువ ఉండేదన్నారు. కృష్ణా డెల్టా కింద నీటిని ఉపయోగించుకుంటూ ఉండటంతో భూములు ఇచ్చే పరిస్థితులలో కూడా లేరన్నారు చంద్రబాబు.
” రాజధాని కోసం పిలుపిస్తే.. 58 రోజులలో, 29 వేల మంది రైతులు.. 34 వేల ఎకరాల భూములు ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్.. అభివృద్ధిలో రైతుల భాగస్వా్మ్యం.. ప్రపంచంలో ఇదో కేస్ స్టడీ. తమ జీవితాలు బాగుపడతాయని.. హైదరాబాద్ అభివృద్ధి చూసిన నమ్మకంతో భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు వచ్చారు. హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టు కోసం 5 వేల ఎకరాలు భూసేకరణ చేశాం. అప్పుడు భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు కోటీశ్వరులు అయ్యారు. ఇక్కడ భూములు ఇవ్వండి.. పక్కన కొనుక్కోండి. ఇక్కడ ఎయిర్పోర్టు వస్తుంది.. దీంతో మీ భూముల విలువ పెరుగుతుందని చెప్పాం.. చాలా మంది నమ్మారు, ఇప్పుడు బాగుపడ్డారు. ” అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

