
ప్రజలకు అందించే సేవలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మీ సేవ సర్వీసులు, టెన్త్, ఇంటర్ హాల్ టికెట్లతోపాటు పలు సర్వీసులను వాట్సాప్ ద్వారా అందిస్తుండగా.. మరిన్ని సేవలను కూడా డిజిటల్గా అందించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ శాఖలన్నింటినీ వాట్సాప్తో లింక్ చేయనున్నారు. త్వరలోనే పలు పథకాలకు కూడా వాట్సాప్లో అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ సేవల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఒక్క క్లిక్తో ప్రభుత్వ సేవలను.. మన అరచేతిలోకే తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతోంది. మీ-సేవ, ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ తిరిగే అవకాశం లేకుండా.. సెల్ఫోన్లోనే చూసుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ పాలనను.. ప్రజల చేతిలోకి తీసుకువచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే మీ-సేవ ద్వారా అందే సేవలు, ఇంటర్, పది పరీక్షల హాల్ టికెట్లను ఇప్పటికే వాట్సాప్లో అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రభుత్వం.. ప్రభుత్వ సేవలను కూడా డిజిటల్గా అందుబాటులోకి తెస్తోంది.
ఒక్కొక్కటిగా వివిధ శాఖల సేవలను కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్తో లింక్ చేస్తోంది. ఇలా చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతీ సేవకు సంబంధించిన లింక్ ఒక్క వాట్సాప్ మెసేజ్తో అరచేతిలోకి రానుంది. అదే సమయంలో భవిష్యత్తులో రాష్ట్ర స్థాయి ఉద్యోగ పరీక్షలకు సంబంధించిన రిక్రూట్మెంట్ బోర్డులు కూడా ఈ వాట్సాప్నే వినియోగించేలా ప్లాన్లు కూడా జరుగుతున్నాయి. ఇక ప్రభుత్వ సేవలన్నీ ఆన్లైన్ అయి వాట్సాప్లో అందుబాటులోకి వస్తే.. ఇంటర్నెట్ సెంటర్లు, మీ-సేవ సెంటర్ల చుట్టూ తిరిగే పని లేకుండా కేవలం వాట్సాప్ ద్వారా ప్రజలకు సేవలు అందుతాయని అధికారులు పేర్కొంటున్నారు.

