
కేపీహెచ్బీలో గజం భూమి రూ.2.65 లక్షలు పలకడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది. హౌసింగ్ బోర్డు నిర్వహించిన ఈ వేలంలో.. భారీ ధర పలికి రికార్డుల్లోకి ఎక్కింది. 4 ప్లాట్లు, 8 ఫ్లాట్లు విక్రయించడంతో హౌసింగ్ బోర్డు ఖజానాకు ఏకంగా రూ.24.26 కోట్లు వచ్చి చేరాయి. గత కొన్ని రోజులుగా ఖాళీ ప్లాట్ల విక్రయం హైదరాబాద్ నగరంలో భారీ ధర పలికి.. అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
హైదరాబాద్లో భూముల ధరలకు రెక్కలు వస్తున్నాయి. గజం లక్షల్లో పలుకుతూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాజాగా కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ( కేపీహెచ్బీ )లో ఉన్న భూములకు వేలం నిర్వహించగా.. కళ్లు చెదిరే మొత్తంలో ఆదాయం లభించింది. ఏకంగా రూ.24.26 కోట్ల ఆదాయం హౌసింగ్ బోర్డుకు సమకూరినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇందులో ఒక్క ప్లాట్లో గజం ధర ఏకంగా రూ.2.65 లక్షలు పలకడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇటీవలి కాలంలో హైదరాబాద్ నగరంలో ఉన్న ఖాళీ స్థలాలను హౌసింగ్ బోర్డు అధికారులు వేలం నిర్వహిస్తుండగా.. రికార్డు స్థాయి ధరలు పలుకుతున్నాయి.
కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్వహించిన హౌసింగ్ బోర్డు వేలంలో గజం భూమి ధర రూ.2.65 లక్షలకు చేరుకోవడం నగర రియల్ ఎస్టేట్ రంగంలో సంచలనం రేపుతోంది. ఈ వేలంలో భారీగా బిడ్డర్లు పాల్గొనడంతో ప్లాట్లు, ఫ్లాట్లు ఎవరూ ఊహించని ధరలు పలికాయి. ఈ ప్లాట్లకు కనీస అప్సెట్ ధర గజానికి రూ.1.30 లక్షలుగా హౌసింగ్ బోర్డు అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే వేలంలో బిడ్డర్లు పోటా పోటీగా పాట పాటడంతో చివరికి గజం ధర రూ.2.65 లక్షల వద్ద ముగిసింది. అయితే కేపీహెచ్బీ ప్రాంతంలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ధర ఇదే అని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.

