
నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక విప్లవానికి నాంది పలుకుతూ క్రిస్ సిటీ రూపుదిద్దుకుంటోంది. చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో భాగంగా 10,834 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సిటీని అభివృద్ధి చేస్తున్నారు. వాక్ టు వర్క్ కాన్సెప్ట్తో నివాస ప్రాంతాలు, స్కూల్స్, హాస్పిటల్ వంటి సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోంది. 2028 నాటికి తొలిదశ పనులు పూర్తికావడమే లక్ష్యంగా సుమారు 35 శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.
నెల్లూరు జిల్లాకు మహర్దశ పట్టనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో 10 వేల ఎకరాల్లో క్రిస్ సిటీ (Krishnapatnam Industrial Smart City) ఏర్పాటు కానుంది. చెన్నై-బెంగళూరు పారిశ్రామిక నడవా (CBIC)లో భాగంగా ఈ క్రిస్ సిటీ రూపుదిద్దుకుంటోంది. పారిశ్రామిక అవసరాలతో పాటు.. రెసిడెన్షియల్ జోన్లు సైతం అభివృద్ధి చేస్తున్నారు. ప్లగ్ అండ్ ప్లే విధానంలో మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు మెుత్తం మూడుదశల్లో కలిపి 10,834 ఎకరాల్లో పారిశ్రామిక మౌలిక సదుపాయాలను కల్పించాలన్నది సర్కార్ టార్గెట్. తొలిదశలో 2,006.09 ఎకరాల్లో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. అందుకు రూ.1,174 కోట్లు ఖర్చుచేస్తోంది. 2028 జనవరి నాటికి తొలిదశ ప్రాజెక్టు పనులు పూర్తికానున్నాయి.
క్రిస్ సిటీలో పరిశ్రమల ఏర్పాటుకు మౌలిక సదుపాయాలతో పాటుగా ఆయా పరిశ్రమల్లో పనిచేసే సిబ్బంది అక్కడే ఉండేందుకు రెసిడెన్షియల్ జోన్లను కూడా అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఉన్న పారిశ్రామిక పార్కులకు భిన్నంగా ఈ క్రిస్ సిటీని తీర్చిదిద్దుతున్నారు. ఇళ్ల నుంచి నేరుగా ఆఫీసులకు నడిచి వెళ్లేలా వాక్ టు వర్క్ సదుపాయాలు కల్పించనున్నారు. వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లు, గ్రీనరీతో ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నట్లు అధికారులు వెల్లడించారు. మెుత్తం16 లొకేషన్లలో రెసిడెన్షియల్ జోన్లు, ప్రైవేటు కార్యాలయాలు, ఆర్ట్ గ్యాలరీ.. కల్చరల్ సెంటర్, ప్రైవేట్ ఆసుపత్రి, పబ్లిక్ లైబ్రరీ, స్పోర్ట్స్ సెంటర్, కమ్యూనిటీ హాల్, రిటైల్ షాపింగ్ మాల్, పాఠశాలలు, అగ్నిమాపక కేంద్రం, పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.

