
నందిని సిధారెడ్డికి కేంద్రం అరుదైన గౌరవం కల్పించింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును నందిని సిధారెడ్డికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నందిని సిధారెడ్డి రాసిన అనిమేష కవితా సంపుటికి గానూ ఈ పురస్కారం వరించింది. కరోనా సమయంలో నందిని సిధారెడ్డి.. ఈ పుస్తకాన్ని రచించారు. నందిని సిధారెడ్డికి.. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ కవి, ఉద్యమకారుడు, రచయిత నందిని సిధారెడ్డి కి అరుదైన గౌరవం లభించింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇవాళ ప్రకటించిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల్లో.. నందిని సిధారెడ్డికి కూడా ఈ గౌరవం కల్పించింది. కరోనా కాలంలో నెలకొన్న పరిస్థితులను నందిని సిధారెడ్డి.. కళ్లకు కట్టినట్లు ఆయన అనిమేష కవితా సంపుటి రాయగా దానికి ఈ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సాహిత్య అకాడమీ ఛైర్మన్గా నందిని సిధారెడ్డిని నియమించడం విశేషం.
కరోనా సమయంలో సామాజిక పరిస్థితులు, మానవీయ కోణాలను ఆయన ఈ అనిమేష కవితా సంపుటిలో చిత్రించారు. ఇక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించిన వారికి రూ. లక్ష నగదు ప్రోత్సాహంతోపాటు.. తామ్రపత్రం, శాలువాను కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేస్తుంది. 1955లో మెదక్ జిల్లా బందారం గ్రామంలో నందిని సిధారెడ్డి పుట్టారు. ఆయన తండ్రి నర్రా బాలసిద్ధారెడ్డి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన ఒక గొప్ప కమ్యూనిస్టు యోధుడు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పూర్తిచేసిన నందిని సిధారెడ్డి.. ‘ఆధునిక తెలుగుకవిత్వంలో సూర్యుడు’ అనే అంశంపై 1981లో ఎంఫిల్ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత ‘ఆధునిక కవిత్వం, వాస్తవికత-అధివాస్తవికత’ పై పరిశోధనలకు గానూ 1986 పీహెచ్డీ పట్టా వరించింది.

