
భారత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో సెషన్లో మంచి లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా యుద్ధం కాస్త శాంతించిందని తెలుస్తోంది. కిందటి రోజే ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై 5 రోజుల పాటు దాడుల్ని నిలిపివేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా.. సూచీలు పుంజుకున్నాయి. కిందటి రోజు సెన్సెక్స్ ఏకంగా 1372 పాయింట్లు పెరగ్గా.. నిఫ్టీ 400 పాయింట్లు పుంజుకుంది. ఇవాళ మార్చి 25న ట్రంప్ మరో ప్రకటన చేశారు. అమెరికా- ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయని. అణ్వాయుధాన్ని ఎప్పటికీ తయారుచేయకుండా ఉండేందుకు కూడా అంగీకరించిందని చెప్పారు.
ఇక్కడ ట్రంప్ ప్రకటనతో ఒక్కసారిగా ముడి చమురు ధరలు గరిష్ఠాల నుంచి భారీగా దిగొచ్చాయి. కిందటి రోజు 100 డాలర్లకుపైగా ఉండగా.. ఇవాళ 5 శాతానికిపైగా పడిపోయింది. ప్రస్తుతం 95 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. ఇంట్రాడేలో 93 డాలర్ల స్థాయికి కూడా పడిపోయింది. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడిందని చెబుతున్నారు.
క్రూడాయిల్ ధరలు తగ్గిన నేపథ్యంలోనే స్టాక్ మార్కెట్లలో కొనుగోళ్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం మార్చి 25న వార్త రాసే సమయంలో ఉదయం 11 గంటలకు సెన్సెక్స్ 1600 పాయింట్లకుపైగా లాభపడి 75,650 మార్కుపైన కొనసాగుతోంది. ఇదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ దాదాపు 500 పాయింట్లు పెరిగి 400 స్థాయిలో ఉంది. సెషన్ ఆరంభంలోనే దాదాపు 1000 పాయింట్ల వరకు లాభాల్లో ప్రారంభమైంది సెన్సెక్స్.

