
పీఎం కిసాన్ పథకంలో అనర్హుల ఏరివేత ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. అయితే ఈ పథకంలో భాగంగా తెలంగాణ నుంచి 32 వేల మంది రైతులు అనర్హులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే వారి పేర్లను అర్హుల జాబితా నుంచి తొలగించే పనిలో పడ్డారు. ఐటీ చెల్లింపుదారులు, భూమిని అమ్మేసినప్పటికీ.. ఇంకా పీఎం కిసాన్ సొమ్మును అందుకుంటున్నట్లు గుర్తించిన అధికారులు.. వారికి సాయాన్ని కట్ చేయనున్నట్లు తెలిపారు.
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యవసాయం చేసే రైతులకు ఆర్థికంగా అండగా ఉండేందుకు.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ( పీఎం కిసాన్ ) పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున మొత్తం రూ.6 వేలను రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. 2018-19 సంవత్సరంలో ప్రారంభమైన ఈ పీఎం కిసాన్ పథకంలో భాగంగా ఇప్పటివరకు 21 విడతలుగా.. దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన రైతుల అకౌంట్లలో రూ.14,237.05 కోట్లను వేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి.
కానీ.. పీఎం కిసాన్ పథకం నిబంధనలను అతిక్రమించి కొందరు అనర్హులు కూడా కేంద్రం నుంచి సాయం పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వారిని గుర్తించి.. వారికి పీఎం కిసాన్ నిధులను కట్ చేయాలని కేంద్రం భావించింది. ఇందులో భాగంగానే ఈ పథకం అనర్హులను గుర్తించే పనిలో పడింది. ఈ క్రమంలోనే తెలంగాణలో 32 వేల మంది రైతులు.. నిబంధనలకు విరుద్ధంగా కేంద్రం నుంచి సాయాన్ని పొందుతున్నారని గుర్తించారు. ఆదాయపు పన్ను కట్టేవారు, భూమిని విక్రయించిన వారే అత్యధికంగా ఉన్నట్లు గుర్తించారు.

