మీకు రేషన్ కార్డు ఉందా..? రేషన్ షాపుకు వెళ్లి బియ్యం తీసుకోవడం లేదా? అయితే మీ అకౌంట్లోకి నేరుగా డబ్బులు వచ్చేస్తాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది. మీరు బియ్యం తీసుకోకపోతే ఆటోమేటిక్‌గా డబ్బులు జమ అవుతాయి.

ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్ న్యూస్ అందించింది కూటమి ప్రభుత్వం. రేషన్ తీసుకోకపోతే మిగిలిన కోటాను లెక్కించి లబ్దిదారులకు నగదు అందించనున్నారు. రేషన్ సరుకుల్లో జరుగుతున్న అక్రమాలు, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం అమలు చేసేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే గుజరాత్‌లో ఈ విధానాన్ని అమలు చేస్తోండగా.. ఇటీవల రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులు అక్కడ పర్యటించారు. అక్కడ అమలవుతున్న విధానాన్ని క్షుణ్నంగా పరిశీలించారు. ప్రస్తుతం గుజరాత్‌లో పైలట్ ప్రాజెక్టుగా సీబీడీసీ విధానం అమలు చేస్తుండగా.. అక్కడ విజయవంతంగా నడుస్తుండటంతో ఏపీలో కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది.

రేషన్ తీసుకోకపోతే నేరుగా అకౌంట్లోకి డబ్బులు..?

రేషన్ కార్డు ఉన్నవారికి కూపన్లు అందిస్తారు. ఈ కూపన్లను డీలర్లకు ఇచ్చి మీ కోటా ప్రకారం బియ్యం తీసుకోవచ్చు. ఒకవేళ మీరు బియ్యం తీసుకోని పక్షంలో మీ కోటాను లెక్కించి మీ అకౌంట్లో నగదు జమ చేస్తారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్నీ ద్వారా వీటిని నేరుగా లబ్దిదారుడి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. రేషన్ బియ్యంను నగదు రూపంలో బదిలీ చేయడమే ఈ విధాన లక్ష్యం. తొలుత ఏపీలోని విశాఖపట్నంలో నగదు బదిలీ కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే ఈ విధానం ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతున్నారు. విశాఖపట్నంలో వచ్చే ఫీడ్ బ్యాక్‌ను బట్టి దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా దీనిని అమలు చేయనున్నారు. త్వరలో దీనిపై ఒక స్పష్టత రానుందని తెలుస్తోంది. సీడీబీసీ అనగా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అని అర్థం. ఈ విధానంలో లబ్దిదారుడి అకౌంట్లో నగదు జమ చేస్తారు.

త్వరలోనే విధివిధానాలు..

త్వరలోనే ఈ కార్యక్రమం అమలు గురించి ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని తెలుస్తోంది. రేషన్ షాపులకు వెళ్లి చాలామంది లబ్దిదారులు బియ్యం తీసుకోవడం లేదు. దీంతో మిగిలిపోయిన బియ్యం బ్లాక్ మార్కెట్‌కు వెళుతుంది. కొంతమంది రేషన్ బియ్యం తీసుకుని తిరిగి డీలర్‌కే అమ్ముతున్నారు. ఇక కొంతమంది వీటిని సేకరించి పాలిష్ చేసిన అనంతరం విదేశాలకు తరలించి ఎక్కువ ధరకు విక్రయించుకుంటున్నారు. దీంతో రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా సీబీడీసీ విధానం అమలు చేయాలని చూస్తోంది. ఈ విధానం వల్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని భావిస్తోంది. త్వరలో ఈ విధానం అమలుకు సంబంధించి విధివిధానాలను ప్రభుత్వం జారీ చేయనుంది. ఇది అమల్లోకి వస్తే బియ్యం బదులు డబ్బులు తీసుకోవచ్చన్నమాట.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *