
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. తనను నమ్మించి గద్దెనెక్కిన వారే వెన్నుపోటు పొడిచి పార్టీ నుంచి వెళ్లగొట్టారన్న ఆవేదనతో ఉన్న శశికళ.. ఇప్పుడు తన పగ తీర్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఉత్తర తమిళనాట తిరుగులేని శక్తిగా ఉన్న పీఎంకే అధినేత రామదాస్తో చేతులు కలిపి.. ఎన్డీయే కూటమికి కోలుకోలేని దెబ్బ కొట్టేందుకు వ్యూహం రచించారు. తేవర్, వన్నియార్ అనే రెండు అతిపెద్ద సామాజిక వర్గాలను ఏకం చేస్తూ ఈ ఇద్దరు నేతలు పెట్టుకున్న పొత్తు.. వారికి ఏమేర లాభం చేకూర్చనుందో చూడాలి.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. ద్రవిడ రాజకీయాల్లో అనూహ్యమైన మలుపు చోటుచేసుకుంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ, పీఎంకే అధినేత డాక్టర్ రామదాస్ మధ్య కుదిరిన పొత్తు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. శశికళ నేతృత్వంలోని ‘ఆల్ ఇండియా తలైవర్ మక్కల్ మున్నేట్ర కజగం’ (ఏఐపీటీఎమ్ఎమ్కే), రామదాస్ పీఎంకే కలిసి ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాయి. ముఖ్యంగా వీరిద్దరూ తమ గెలుపు కంటే.. ఎన్డీఏకు చెక్ పెట్టేందుకే ఒక్కటైనట్లు తెలుస్తోంది.
తనను రాజకీయంగా ఏకాకిని చేసిన పళనిస్వామికి బుద్ధి చెప్పేందుకు, ఏఐఏడీఎంకేకు పెట్టని కోటగా ఉన్న ‘తేవర్’ సామాజిక వర్గం ఓట్లను చీల్చడం ద్వారా ఎన్డీయే కూటమికి భారీ నష్టం కలిగించాలని ఆమె స్కెచ్ వేశారు. మరోవైపు పీఎంకే అధినేత రామదాస్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఎన్డీయేతో పొత్తు పెట్టుకున్న తన కుమారుడు పీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు అయిన ఆయనకే.. చట్టబద్ధంగా ఆయన పార్టీ గుర్తును కానీ నాయకత్వ పదివిని కానీ పొందలేకపోయారు. అయితే రాజకీయంగా, వ్యక్తిగతంగా ఒంటరి పోరాటం చేస్తున్న తరుణంలో ఆయన శశికళతో చేతులు కలిపారు.

