
నేషనల్ క్రష్ రష్మిక మందానా అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన ఘనత సాధించారు. జపాన్లోని టోక్యోలో మే 23న జరగనున్న ‘క్రంచీరోల్ యానిమే అవార్డ్స్ 2026’లో ఆమె ప్రెజెంటర్గా వ్యవహరించబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక వేదికపై వరుసగా రెండుసార్లు అవార్డులు అందజేస్తున్న తొలి భారతీయ నటిగా రష్మిక చరిత్ర సృష్టించారు. ‘పుష్ప’ సినిమాతో జపాన్లో భారీ క్రేజ్ సంపాదించుకున్న ఆమెను క్రంచీరోల్ సంస్థ ‘ఇండియాస్ స్వీట్హార్ట్’గా అభివర్ణించింది.
నేషనల్ క్రష్ రష్మిక మందానా పేరు మళ్లీ ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. కేవలం టాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాదు ఏకంగా అంతర్జాతీయ వేదికపై భారతీయ సినిమా సత్తాను చాటుతూ ఆమె సరికొత్త చరిత్ర సృష్టించారు. జపాన్ వేదికగా జరిగే ప్రతిష్టాత్మక ‘క్రంచీరోల్ యానిమే అవార్డ్స్’ (Crunchyroll Anime Awards) లో వరుసగా రెండోసారి ప్రెజెంటర్గా ఎంపికై ఈ గౌరవం దక్కించుకున్న తొలి భారతీయ సినీ సెలబ్రిటీగా రష్మిక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు.
యానిమేటెడ్ చిత్రాలు, వెబ్ సిరీస్ల ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డుల వేడుక మే 23న టోక్యోలో అంగరంగ వైభవంగా జరగనుంది. ఇది ఈ అవార్డ్స్ యొక్క పదో ఎడిషన్. 2024లో కూడా రష్మిక ఈ వేదికపై మెరిసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు మరోసారి హాలీవుడ్ దిగ్గజాలతో కలిసి విజేతలకు అవార్డులు అందజేయనున్నారు. రష్మిక రాకతో ఈ అంతర్జాతీయ ఈవెంట్పై భారతీయ ప్రేక్షకుల్లో ముఖ్యంగా యానిమే ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రష్మికకు జపాన్లో ఈ స్థాయిలో గుర్తింపు రావడానికి ప్రధాన కారణం ‘పుష్ప’ సినిమానే. అందులో ఆమె పోషించిన ‘శ్రీవల్లి’ పాత్రకు జపాన్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అక్కడి సోషల్ మీడియాలో రష్మికకు ఉన్న ఫాలోయింగ్ చూసి నిర్వాహకులు ఆమెను వరుసగా రెండోసారి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. భారతీయ నటీమణులు గ్లోబల్ స్టార్లుగా ఎదుగుతున్నారనడానికి రష్మిక ఒక ఉదాహరణగా నిలిచారు.

