
విశాఖపట్నం వేదికగా ఆంధ్రప్రదేశ్ ఐటీ ముఖచిత్రం సమూలంగా మారిపోనుంది. ఒకప్పుడు వలసలకు చిరునామాగా ఉన్న ఉత్తరాంధ్ర, ఇప్పుడు ప్రపంచానికి ‘ఏఐ గేట్వే’గా అవతరించబోతోంది. ఈ మహాద్భుత ఘట్టానికి ఏప్రిల్ 28, 2026న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ శ్రీకారం చుట్టారు.
విశాఖ సమీపంలోని తర్లువాడలో లక్షా 35 వేల కోట్ల రూపాయల భారీ వ్యయంతో, దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్, ఐటీ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ప్రపంచంలోనే తొలిసారిగా ఒక గిగావాట్ (1000 మెగావాట్స్) సామర్థ్యంతో ఈ సెంటర్ ఏర్పాటు కాబోతోంది.
అదానీ కనెక్ట్స్, ఎయిర్టెల్ నెక్స్ట్రా సంస్థలు ఈ మెగా ప్రాజెక్టులో గూగుల్తో చేతులు కలిపాయి. 2028 సెప్టెంబరు నాటికి నిర్మాణం పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. క్లౌడ్ సర్వీసెస్, డీప్ లెర్నింగ్, హైస్పీడ్ ఏఐ ట్రైనింగ్లకు ఇది గుండెకాయలా మారనుంది.
శంకుస్థాపన అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 30 ఏళ్ల క్రితం సైబరాబాద్ ఎలాగైతే సంపద సృష్టించిందో, ఇప్పుడు విశాఖ గూగుల్ సెంటర్ ఏపీ భవిష్యత్తును మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ డేటా సెంటర్ రాకతో ఐటీ స్టార్టప్లు, సెమీకండక్టర్ కంపెనీలు వైజాగ్కు క్యూ కట్టనున్నాయి.
ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ రంగాల్లో యువతకు వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. త్వరలో ఏఐ అసిస్టెంట్ ద్వారా సీఎం కార్యాలయం నుండి సుపరిపాలన అందించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అనకాపల్లి జిల్లా మరో రంగారెడ్డి జిల్లాలా మారుతుందని, ఏఐ అసిస్టెంట్ సహాయంతో ‘స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్’ను అందిస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

