
టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలో ముస్లిం మతం స్వీకరించిన దంపతులు తిరిగి హిందూ మతాన్ని స్వీకరించారు. తిరుపతికి చెందిన అబ్దుల్లా, అమీనా దంపతులు వేద మంత్రోచ్ఛరణల మధ్య హిందూ మతంలోకి మారారు. వీరిద్దరు 30 ఏళ్ల క్రితం కువైట్ వెళ్లారు.. అక్కడ ముస్లిం మతంలోకి మారారు. తాజాగా తిరుపతికి తిరిగొచ్చిన దంపతులు భూమన సమక్షంలో మళ్లీ హిందూమతం స్వీకరించారు.
తిరుపతిలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది.. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నివాసంలో హిందూమత పున:స్వీకరణ మహోత్సవాన్ని నిర్వహించారు. తిరుపతి పీకే లే అవుట్కు చెందిన అబ్దుల్లా, అమీనా దంపతులు తిరిగి హిందూ మతంలోకి వచ్చారు. ఈ జంటను ఆహ్వానిస్తూ ప్రత్యేక హోమం నిర్వహించగా.. ఈ ఇద్దరు తిరిగి హిందూ మతాన్ని స్వీకరించారు. తిరుపతి పీకే లే అవుట్ కాలనీకి చెందిన శ్రీనివాసులు రెడ్డి, పుష్ప దంపతులు 30 ఏళ్ల కిందట జీవనోపాధి కోసం కువైట్ వెళ్లారు. అక్కడి పరిస్థితుల కోసం నాడు ఇస్లాం మతం స్వీకరించారు.. అయితే 5 ఏళ్ల కిందట వీరు తమ స్వస్థలానికి తిరిగొచ్చారు.
శ్రీనివాసులు రెడ్డి టీటీడీ మాజీ ఛైర్మన్ భూమనకు చిన్ననాటి క్లాస్మెట్ కాగా.. కువైట్ నుంచి తిరిగొచ్చిన తర్వాత కొన్ని రోజులకు తిరుపతిలో ఇద్దరు స్నేహితులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు రెడ్డి ముస్లింగా మారి అబ్బుల్లాగా పేరు మార్చుకున్నట్లు భూమనకు తెలిసింది. ఆ విషయం తెలిసిన నాటి నుంచి.. ఎందుకిలా చేశారు, తిరిగి హిందూ మతంలోకి రావాలని కోరారు. ముఖ్యంగా ఏడాది కాలంగా పదే పదే చెప్పడంతో అబ్దుల్లా, అమీనా దంపతులు బాగా ఆలోచించి.. తిరిగి హిందూ మతంలోకి రావడానికి నిర్ణయం తీసుకున్నారు. హిందూ మతంలోకి రావడానికి నిర్ణయించుకున్న ఈ దంపతులు.. ఆ కార్యక్రమం కోసం భూమనను ఆశ్రయించారు. దీంతో భూమన.. పద్మావతిపురంలోని తన స్వగృహంలో ‘హిందూ పున:స్వీకరణ మహోత్సవం’ ఏర్పాటు చేశారు.

