
Simhachalam Temple Chandanotsavam Arrangements Review:
సింహాచలం చందనోత్సవం ఏర్పాట్లపై విశాఖపట్నం జిల్లా ఇన్చార్జ్ మంత్రి Dola Sree Bala Veeranjaneya Swamy సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో కలిసి ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా సాధారణ భక్తులకు ప్రాధాన్యం కల్పించాలని, టికెట్ల జారీలో ఎలాంటి లోపాలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు ఉండాలన్నారు.
సింహాచలం లక్ష్మీనృసింహ స్వామి చందనోత్సవం ఏప్రిల్ 20న జరగనుండటంతో ప్రభుత్వం ముందస్తుగా చర్యలు చేపట్టింది. మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్తో కలిసి సమగ్రంగా ఏర్పాట్లను సమీక్షించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చందనోత్సవంలో సామాన్య భక్తులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.
ఏప్రిల్ 17 నాటికి టికెట్ల జారీ ప్రక్రియ పూర్తిచేయాలని, వాహన పాస్లు, డ్యూటీ పాస్ల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దర్శన టికెట్ల విషయంలో ఎలాంటి గందరగోళం రాకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. గత ఏడాది రాత్రి వరకు టికెట్ల జారీ ఆలస్యం కావడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. ఈసారి మూడు రోజుల ముందుగానే టికెట్లు విడుదల చేయాలని, టికెట్ల లెక్కలు పారదర్శకంగా ఉండాలని సూచించారు. కలెక్టర్, ఈవో చేతుల మీదుగా టికెట్ల జారీ చేస్తే మరింత పారదర్శకత ఉంటుందని పేర్కొన్నారు. అలాగే టికెట్లపై క్యూఆర్ కోడ్, టైమ్ స్లాట్ వివరాలు తప్పనిసరిగా ఉండేలా చూడాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ Harendhira Prasad మాట్లాడుతూ, చందనోత్సవం రోజు భక్తుల కోసం వేర్వేరు క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రూ.300, రూ.1000, రూ.1500 టికెట్లు కలిగిన భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు ఉంటాయని చెప్పారు. రూ.1500 టికెట్ ఉన్నవారు భోగమండపం నుంచి స్వామిని దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నామని వివరించారు. ఉత్సవం రోజు ఉదయం సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, అనంతరం వ్యవస్థాపక ధర్మకర్తలకు తొలి దర్శనం కల్పిస్తామని తెలిపారు.
ఏపీ ప్రభుత్వం, Tirumala Tirupati Devasthanams తరఫున స్వామికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని, వేకువజామున 4:30 గంటల నుంచి వీఐపీ దర్శనాలు ప్రారంభమవుతాయని చెప్పారు. అంతరాలయ దర్శనాలు ఉండవని కూడా స్పష్టం చేశారు.
చందనోత్సవం కోసం వచ్చే భక్తుల రవాణా సౌకర్యార్థం కొండ దిగువన 50 ఆర్టీసీ బస్సులను సిద్ధంగా ఉంచుతున్నామని కలెక్టర్ తెలిపారు. భద్రతా ఏర్పాట్లపై విశాఖపట్నం సీపీ Shankhabrata Bagchi వివరించారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని తెలిపారు. చిన్నారుల భద్రత కోసం ప్రత్యేక ట్యాగ్ వ్యవస్థను అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

