
తమ ప్రభుత్వంలో పేదల సొంతింటి కల సాకారం చేస్తామని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) వ్యాఖ్యానించారు. ‘మన ఇల్లు – మన లోకేశ్’ పేరుతో మంగళగిరిలో ఈరోజు (మంగళవారం) ఇళ్లపట్టాలను పంపిణీ చేశారు.
లోకేశ్ చేతుల మీదుగా మూడువేల మందికి ఇంటి పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడారు. 2024 ఎన్నికల హామీలో భాగంగా ఇళ్లపట్టాలు పంపిణీ చేశామని తెలిపారు. నిరుపేద కుటుంబాలకు రూ.1000కోట్ల ఆస్తిని ఇళ్లపట్టాల రూపంలో అందసినట్లు లోకేశ్ వెల్లడించారు.
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి ఆదాయం రూ.1. ఉంటే ఖర్చు రూ.1.60పైసలుగా ఉందని వివరించారు. రెండేళ్ల అభివృద్ధితో ఖర్చు రూ.1.40కి చేరిందని తెలిపారు. నేడు ఇచ్చే శాశ్వత భూపట్టాతో పేదల ఆస్తిని ఎవరూ కదిలించలేరని స్పష్టం చేశారు.
అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల్లా తీసుకెళ్తున్నామని లోకేశ్ ఉద్ఘాటించారు. 2019లో తన ఓటమికి సీఎం చంద్రబాబును కూడా కొంతమంది అవహేళన చేశారని ధ్వజమెత్తారు. ఆ కసితోనే మంగళగిరిని అభివృద్ధికి చిరునామాగా మారుస్తున్నామని వ్యాఖ్యానించారు. దేశంలో నంబర్ వన్ నియోజకవర్గంగా మంగళగిరిని మార్చి చూపిస్తానని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.

