రాష్ట్ర రాజకీయాల్లో ఆత్మీయతకు అద్దం పట్టిన దృశ్యం ఇది. ముంబయిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని చికిత్స పొందుతున్న ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. పవన్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకోవడంతో పాటు కొంతసేపు ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడారు. త్వరగా కోలుకుని ప్రజాసేవలోకి తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతల మధ్య ఆత్మీయ సంభాషణ చోటుచేసుకుంది. ఎన్డీఏ కూటమి నాయకుల మధ్య ఉన్న సమన్వయానికి ఈ భేటీ మరో నిదర్శనంగా నిలిచింది.

ముంబయిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను తెలుసుకున్న సీఎం.. వైద్యుల సూచనలను పాటిస్తూ పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కొంతసేపు పవన్ కళ్యాణ్తో ప్రత్యేకంగా మాట్లాడిన చంద్రబాబు.. ఆయన త్వరగా కోలుకుని తిరిగి ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షించారు. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన సీఎం.. పూర్తిస్థాయిలో కోలుకునే వరకు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించినట్లు సమాచారం.
పవన్ కళ్యాణ్ చికిత్స పొందుతున్న సమయంలో రాష్ట్రంలోని పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షలు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా పెద్దఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం చంద్రబాబు స్వయంగా ఆస్పత్రికి వెళ్లి పవన్ కళ్యాణ్ను పరామర్శించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ముంబయికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం ఇద్దరు నాయకుల మధ్య ఉన్న ఆత్మీయతను ప్రతిబింబిస్తోందని కూటమి నేతలు పేర్కొంటున్నారు.

