
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కీలకమైన నేషనల్ హైవే 565 పనులు పూర్తి చేశారు. ఈ హైవేపై వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే ఈ హైవే పనుల్లో భాగంగా.. యర్రగొండపాలెం దగ్గర 20 కిలో మీటర్ల రోడ్డును విస్తరించారు. దీంతో హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు ఊరట దక్కింది. ఈ 20 కిలో మీటర్లు అటవీ ప్రాంతం మీదుగా వెళుతోంది.. బ్రిడ్జిలు, అండర్పాస్లతో ప్రయాణం సాఫీగా సాగుతోంది.
తెలుగు రాష్ట్రాల మధ్య నేషనల్ హైవే 565 కీలకంగా మారింది. ఈ హైవే తెలంగాణలోని నకిరేకల్ దగ్గర జాతీయ రహదారి 65 దగ్గర మొదలై.. ఆంధ్రప్రదేశ్లోని ఏర్పేడు దగ్గర నేషనల్ హైవే 71 దగ్గర ముగుస్తుంది. ఈ హైవే నల్గొండ, మాచర్ల, యర్రగొండపాలెం, మార్కాపురం, పొదిలి, కనిగిరి, పామూరు, దుత్తలూరు, రాపూపురు, వెంకటగిరి, ఏర్పేడు మీదుగా వెళుతోంది. అయితే గతంలో కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నుంచి హైదరాబాద్ రాత్రిళ్లు అటవీ ప్రాంతం మీదుగా వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ముఖ్యంగా పుల్లల చెరువు దగ్గర నుంచి వెల్దుర్తి మండలం వరకు రోడ్డు పరిస్థితి దారుణంగా ఉండేది.. ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యేవి. అయితే జాతీయ రహదారి 565 నిర్మాణంతో ఆ కష్టాల నుంచి ఊరట దక్కింది. ఈ రోడ్డు అభివృద్ధి చేయడంతో యర్రగొండపాలెం నుంచి హైదరాబాద్కు ప్రయాణం మరింత సులభతరం అయ్యింది.
ఈ రూట్లో..ఎన్హెచ్-565లో భాగంగా ఉన్న ఈ 20 కిలోమీటర్ల రోడ్డు విస్తరణకు గతంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా అటవీ అనుమతులతో పాటుగా మరికొన్ని అడ్డంకులు వచ్చాయి. అయితే 2024లో ఈ పనులకు లైన్ క్లియర్ కావడంతో.. గతేడాది పనులు ప్రారంభించి వేగవంతం చేశారు. ఈ రోడ్డును టార్గెట్ కంటే ముందే పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ రోడ్డలో అటవీ ప్రాంతం మీదుగా కొండలు, లోయల మధ్యలో నుంచి వెళుతుంటే ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తోంది.

