
జపాన్ ఓపెన్ సూపర్-750 టోర్నీలో అకనే యమగూచిని ఓడించి, ఈ టైటిల్ గెలిచిన తొలి భారతీయురాలిగా పీవీ సింధు చరిత్ర సృష్టించారు. రెండేళ్ల విరామం తర్వాత ఆమె ఇచ్చిన ఈ ఛాంపియన్ కంబ్యాక్ను అభినందిస్తూ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీనికి సింధు క్రేజీగా స్పందిస్తూ.. రాజమౌళి నెక్స్ట్ మూవీ ‘వారణాసి’ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, భవిష్యత్తులో మీ సినిమాలో ఎప్పుడైనా బ్యాడ్మింటన్ ప్లేయర్ పాత్ర అవసరమైతే, హీరోయిన్గా నటించడానికి తాను ఎప్పుడూ సిద్ధమేనంటూ రాజమౌళిని ఛాన్స్ అడిగారు.
భారత బ్యాడ్మింటన్ సంచలనం, ఒలింపిక్ విజేత పీవీ సింధు అంతర్జాతీయ వేదికపై మరోసారి దేశ కీర్తి పతాకాన్ని ఎగరవేసిన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సరికొత్త రికార్డు సృష్టిస్తూ టైటిల్ కైవసం చేసుకున్నారు. ఆదివారం జరిగిన ఉత్కంఠభరితమైన జపాన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్లో పీవీ సింధు అద్భుత ప్రదర్శన చేశారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో జపాన్కు చెందిన స్టార్ షట్లర్ అకనే యమగూచిని 21-17, 21-17 వరుస సెట్లలో ఓడించి సింధు విజేతగా నిలిచారు. ఈ ఘనత సాధించడం ద్వారా జపాన్ ఓపెన్ టైటిల్ సొంతం చేసుకున్న మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణిగా ఆమె చరిత్ర సృష్టించారు. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత ఆమె క్రీడా రంగాన్నే కాకుండా సినీ రంగాన్ని కూడా ఆశ్చర్యపరిచే ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు. తాను భవిష్యత్తులో వెండితెరపై మెరవడానికి, ముఖ్యంగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి చిత్రంలో నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించారు.
ఈ అసాధారణ విజయంతో సరికొత్త కంబ్యాక్ ఇచ్చిన సింధును అభినందిస్తూ ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సోషల్ మీడియా వేదికగా ఒక ప్రత్యేక పోస్ట్ పెట్టారు. “ఇది ఒక నిజమైన ఛాంపియన్ కంబ్యాక్. నీ అద్భుత విజయానికి శుభాకాంక్షలు సింధు. భారతదేశం మొత్తం నీ గురించి ఎంతో గర్విస్తోంది” అంటూ రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు.

