వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని వరలక్ష్మీ స్వరూపంగా పూజిస్తామని అన్నారు.

అమరావతి, ఆగస్టు 21: వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని వరలక్ష్మీ స్వరూపంగా పూజిస్తామని అన్నారు. ఈ పవిత్ర శ్రావణ శుక్రవారం శ్రీ వరలక్ష్మీ అమ్మవారి కరుణాకటాక్షాలు అందరికీ అందాలని పవన్ ఆకాంక్షించారు.
‘శ్రావణ మాసంలో నిర్వహించే పవిత్రమైన వరలక్ష్మీ వ్రతం భక్తిశ్రద్ధలకు, కుటుంబ సౌభాగ్యానికి, మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక. శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని వరలక్ష్మీ స్వరూపంగా పూజిస్తూ, కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, శాంతి, సౌభాగ్యం కోసం ప్రార్థించే ఈ పవిత్ర పర్వదినం మన ఆధ్యాత్మిక వారసత్వంలోని గొప్ప విశిష్ఠతను ప్రతిబింబిస్తుంది. ఈ పవిత్ర శ్రావణ శుక్రవారం శ్రీ వరలక్ష్మీ అమ్మవారి కరుణాకటాక్షాలు అందరికీ అందాలని, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆరోగ్యం, శాంతి, సమృద్ధి నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజలందరికీ నా హృదయపూర్వక వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు’ అంటూ ఎక్స్లో పవన్ కల్యాణ్ పోస్ట్ చేశారు.

