
ఇరాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఏర్పడిన ఎల్పీజీ సంక్షోభంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. గ్యాస్ కొరతను ఎదుర్కొనే చర్యలపై ఇప్పటికే ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ, అవి పరిమిత ఫలితాలకే పరిమితమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎల్పీజీ సరఫరా సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారంగా ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని పెంచాలని నిర్ణయించారు.
ఎల్పీజీపై ఆధారాన్ని తగ్గిస్తూ పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG), అలాగే విద్యుత్ ఆధారిత వంట పరికరాల వినియోగాన్ని ప్రోత్సహించాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికీ పీఎన్జీ కనెక్షన్లు అందించే దిశగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2.34 లక్షల పీఎన్జీ కనెక్షన్ల సామర్థ్యం ఉన్నప్పటికీ, కేవలం 60 వేల మంది మాత్రమే వాటిని వినియోగిస్తున్నారని అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న కనెక్షన్లను పూర్తిగా వినియోగించుకోవడంతో పాటు, ప్రతి జిల్లాలో కనీసం 10 వేల కొత్త కనెక్షన్లు ఇవ్వాలని సీఎం లక్ష్యంగా నిర్దేశించారు.
అదేవిధంగా శ్రీకాకుళం–కాకినాడ గ్యాస్ పైప్లైన్ పునరుద్ధరణపై కేంద్ర మంత్రికి లేఖ రాయాలని చంద్రబాబు సూచించారు. ఏపీ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ విస్తరణకు తక్షణమే అవసరమైన అనుమతులు జారీ చేయాలని అధికారులకు ఆదేశించారు. తదుపరి కేబినెట్ సమావేశంలో ‘కమర్షియల్ సెక్టార్లో నేచురల్ గ్యాస్ వినియోగాన్ని ప్రోత్సహించే విధానం’ను తీసుకురావాలని పేర్కొన్నారు.
గ్యాస్ కొరతను విద్యుత్ రంగానికి ఒక అవకాశంగా మలుచుకోవాలని సీఎం అభిప్రాయపడ్డారు. ఇండక్షన్ స్టవ్లు, ఎలక్ట్రిక్ కుక్కర్లు వంటి ప్రత్యామ్నాయ వంట పరికరాల వినియోగాన్ని పెంచాలని సూచించారు. అలాగే విద్యాసంస్థలు, ఆస్పత్రులు, అంగన్వాడీలు, అన్న క్యాంటీన్లు, హోటళ్లకు ప్రాధాన్యత క్రమంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరా జరిగేలా చూడాలని ఆదేశించారు.
ఇక ప్రస్తుత పరిస్థితులపై అధికారులు వివరించగా, గత ఐదు రోజులుగా గృహావసరాల కోసం రోజుకు సగటున 1.80 లక్షల ఎల్పీజీ సిలిండర్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రస్తుతం 14,444 మెట్రిక్ టన్నుల గ్యాస్ నిల్వలు ఉన్నాయని వెల్లడించారు.

