
విజయ్ మాల్యా: ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీ చేతులు మారిన విషయం తెలిసిందే. లీగ్ ప్రారంభం నుంచి జట్టును నిర్వహిస్తున్న యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (USL) సంస్థ, రికార్డు స్థాయిలో సుమారు రూ.16,706 కోట్లకు ఆర్సీబీని విక్రయించింది.
ఈ ఫ్రాంచైజీని ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బోల్ట్ వెంచర్స్, బ్లాక్ స్టోన్ సంస్థల కన్సార్షియం సంయుక్తంగా సొంతం చేసుకుంది. పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టును కూడా ఈ ఒప్పందంలో భాగంగా తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో ఆర్సీబీ మాజీ యజమాని విజయ్ మాల్యా సోషల్ మీడియా ద్వారా స్పందించారు. కొత్త యజమానులకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, జట్టు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
“ఆర్సీబీ కొత్త యజమానులకు నా హృదయపూర్వక అభినందనలు. ఐపీఎల్లో అత్యంత విలువైన ఫ్రాంచైజీగా నిలిచిన ఈ జట్టుతో మీరు గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. 2008లో నేను ఈ ఫ్రాంచైజీని రూ.450 కోట్లకు కొనుగోలు చేసినప్పుడు చాలా మంది విమర్శించారు. అది పనికిరాని పెట్టుబడి అని అన్నారు. అయితే నా లక్ష్యం ‘రాయల్ ఛాలెంజ్’ బ్రాండ్ను నిర్మించడం. అందుకే దీనికి RCB అనే పేరు పెట్టాను.
నేడు నేను పెట్టిన రూ.450 కోట్ల పెట్టుబడి రూ.16,500 కోట్లకు పైగా పెరగడం చూసి గర్వంగా ఉంది. అప్పట్లో యువ ఆటగాడిగా ఉన్న విరాట్ కోహ్లీను జట్టులోకి తీసుకోవడం నా మధుర జ్ఞాపకాలలో ఒకటి. నేడు అతను ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరిగా ఎదిగాడు.
ఆర్సీబీని ఆదరిస్తున్న అభిమానులందరికీ నా కృతజ్ఞతలు. ‘బెంగళూరు సింహం’గా పేరుగాంచిన ఈ జట్టుకు మీ మద్దతు ఎప్పటికీ కొనసాగాలని కోరుకుంటున్నాను,” అని మాల్యా తన ట్వీట్లో పేర్కొన్నారు.

