
ఏలూరు జిల్లా నూజివీడు మండలంలో ప్రేమ వివాహానికి సంబంధించిన వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ప్రేమించి పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకున్న యువకుడు.. అనంతరం తన భార్యను ఆమె తల్లిదండ్రులకు అప్పగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్ చేశారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. డబ్బులు చెల్లిస్తే యువతిని ఇంటి వద్దకు తీసుకొచ్చి అప్పగిస్తామని కొందరు వ్యక్తులు చెప్పినట్లు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అసలు ఏం జరిగింది?
నూజివీడు మండలం గొల్లపల్లికి చెందిన రాజేశ్వరి, కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామానికి చెందిన మధు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇద్దరూ మేజర్లేనని పేర్కొన్నారు. నాలుగు రోజుల క్రితం రాజేశ్వరి ఏలూరులోని కాలేజీకి వెళ్లిన సమయంలో మధు స్నేహితులు నలుగురు ఆమెను తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఆ తర్వాత వీరవల్లి పోలీస్ స్టేషన్లో మధు, రాజేశ్వరి ప్రేమ వివాహం చేసుకున్నట్లు సమాచారం. పెళ్లి అనంతరం వారిని ఇంటికి పంపించినట్లు తెలుస్తోంది. అయితే వివాహం జరిగిన తర్వాత తమ కుమార్తె ఎక్కడ ఉంది? ఎలా ఉంది? అనే విషయం తెలియకపోవడంతో రాజేశ్వరి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.
రూ.12 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారంటూ ఆరోపణ
ఈ క్రమంలో మధు తరఫున కొందరు వ్యక్తులు తమకు ఫోన్ చేసి రూ.12 లక్షలు చెల్లిస్తేనే రాజేశ్వరిని అప్పగిస్తామని చెప్పినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమపై ఎలాంటి కేసులు నమోదు చేయకూడదని కూడా షరతు పెట్టినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
డబ్బులు చెల్లించిన అనంతరం యువతిని ఇంటి వద్దకు తీసుకొచ్చి వదిలివెళ్లిపోతామని చెప్పినట్లు వారు పేర్కొన్నారు. తమ కుమార్తెను ఎలాగైనా ఇంటికి తీసుకురావాలనే ఉద్దేశంతో రూ.6 లక్షల వరకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తల్లిదండ్రులు తెలిపారు. అయితే డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా తమ కుమార్తెను అప్పగిస్తారనే నమ్మకం లేకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయాన్ని ఆదివారం రాత్రి మంత్రి కొలుసు పార్థసారథి దృష్టికి తీసుకెళ్లినట్లు రాజేశ్వరి కుటుంబ సభ్యులు తెలిపారు.
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
ఈ ఘటనపై సమాచారం అందుకున్న నూజివీడు పోలీసులు రంగంలోకి దిగారు. యువకుడు మధుతో పాటు అతడి స్నేహితుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. యువతి ఎక్కడ ఉంది? ప్రస్తుతం ఆమె పరిస్థితి ఏమిటి? అనే విషయాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డబ్బుల డిమాండ్పై వచ్చిన ఆరోపణలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలోనూ వేధింపులపై ఫిర్యాదు
మధు తమ కుమార్తెను వేధిస్తున్నాడంటూ గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రాజేశ్వరి తల్లిదండ్రులు వెల్లడించారు. 2025 డిసెంబర్ 6న నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఆ ఫిర్యాదు ఆధారంగా Cr. No. 311/2025, సెక్షన్ 78(2) r/w 3(5) BNS కింద కేసు నమోదైనట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రేమ వివాహం తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు, యువతి ఆచూకీ, రూ.12 లక్షల డిమాండ్పై వచ్చిన ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

