
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 87,179 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 34,256 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. హుండీ ద్వారా టీటీడీకి రూ.4.59 కోట్ల ఆదాయం సమకూరింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోగా.. శిలాతోరణం వరకు క్యూ లైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 20 నుంచి 24 గంటల సమయం పట్టింది.
ఆదివారం 4.03 లక్షల లడ్డూలు విక్రయించగా.. 3.11 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. వివిధ అనారోగ్య కారణాలతో 3,538 మంది శ్రీవారి వైద్య సేవలను పొందారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ కాంప్లెక్సులు, క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్ల వద్ద టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎప్పటికప్పుడు అన్నప్రసాదం, మంచినీరు అందిస్తున్నారు.
ఆలయాల అభివృద్ధిపై టీటీడీ దృష్టి
మరోవైపు నారాయణవనం శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయం, నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయాల అభివృద్ధిపై టీటీడీ దృష్టి సారించింది. ఈ రెండు ఆలయాలను టీటీడీ జేఈవో శరత్ అధికారులతో కలిసి సందర్శించి.. అక్కడ కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతతో పాటు సౌకర్యవంతమైన దర్శన అనుభూతి కలిగేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
దాతల సహకారంతో ఆలయాల్లో ప్రతిరోజూ భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాల వివరాలను జేఈవో శరత్ అడిగి తెలుసుకున్నారు. అన్నప్రసాదం నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని అధికారులకు స్పష్టం చేశారు.

