
ఆంధ్రప్రదేశ్లో బియ్యం ధరలు గణనీయంగా పెరగడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం పడుతోంది. మార్కెట్లో సన్న బియ్యం ధరలు పెరగడంతో నెలవారీ కుటుంబ బడ్జెట్ ప్రభావితమవుతోంది. మూడు నెలల క్రితం రూ.1,000గా ఉన్న 25 కిలోల బియ్యం బస్తా ప్రస్తుతం సుమారు రూ.1,500కు చేరిందని వ్యాపారులు చెబుతున్నారు.
క్వింటాల్ బియ్యం ధర కూడా దాదాపు రూ.2,000 వరకు పెరిగినట్లు సమాచారం. నలుగురు సభ్యులున్న కుటుంబం నెలకు రెండు బస్తాలు కొనుగోలు చేస్తే.. గతంతో పోలిస్తే సుమారు రూ.1,000 వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది.
బుల్లెట్ రైస్, బీబీటీ, ఆరున్నరలు, హెచ్ఎంటీ కోలం, నెల్లూరు సన్నాలు, కర్నూలు సన్నాలు వంటి రకాల ధరలు మూడు నెలల క్రితం రూ.1,000–1,300 మధ్య ఉండగా.. ప్రస్తుతం సుమారు రూ.2,000కు చేరినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, పెరిగిన ధరల కారణంగా కొన్ని హోటల్ యాజమాన్యాలు ఖరీదైన బ్రాండ్లకు బదులుగా స్థానికంగా లభించే బియ్యం రకాల వైపు మొగ్గు చూపుతున్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే నిత్యావసరాల ధరలతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు బియ్యం ధరల పెరుగుదల మరింత భారంగా మారుతోంది.
